భారత్ లో ఇక BBL ధమాకా
ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ మ్యాచ్ లన్నీ కూడా ముగింపుదశకు వచ్చేశాయి. మూడు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి కూడా. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం అయిదు జట్లు.. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఈ పరిణామాల మధ్య మరో శుభవార్త అందింది క్రికెట్ లవర్స్ కు. ఆస్ట్రేలియాలో పిడుగులు కురిపిస్తోన్న బిగ్ బాష్ లీగ్ (BBL) భారత్ లో అడుగు పెట్టబోతోంది. 2026-27 బీబీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్కు భారత్ వేదిక కానుంది. చెన్నై చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఈ హిస్టారికల్ మ్యాచ్ జరగవచ్చని సమాచారం.

ఆస్ట్రేలియా వెలుపల బీబీఎల్ మ్యాచ్ జరగబోతోండటం ఇదే మొదటిసారి కూడా. బీబీఎల్ ఓపెనర్ ను భారత్ లో నిర్వహించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ చాలా నెలలుగా చర్చలు జరుపుతున్నాయి. మొదట్లో క్రికెట్ ఆస్ట్రేలియా పెట్టిన ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి బీసీసీఐ అయిష్టత చూపినప్పటికీ.. క్రికెట్ ఆస్ట్రేలియా పట్టుబట్టడం, పలు రౌండ్ల చర్చలు జరపడంతో మెట్టు దిగింది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను భారత గడ్డపైకి తీసుకురావడానికి ఎట్టకేలకు బీసీసీఐ ఒప్పుకొంది. దీని తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన అయిదుమంది సభ్యుల ప్రతినిధి బృందం ఇటీవలే చెన్నై చెపాక్ స్టేడియాన్ని సందర్శించింది. సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ను సైతం వీక్షించారు.
మ్యాచ్ నిర్వహణ ఎలా ఉంటుందనే విషయంపై ప్రత్యక్షంగా తెలుసుకోవడంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఈ మ్యాచ్ ను అసాంతం తిలకించారు. నిర్వహణ సాధ్యసాధ్యాల గురించి ఆరా తీసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. బీసీసీఐ ఛైర్మన్ మిథున్ మన్హాస్ కూడా చిదంబరం స్టేడియంలో ఉన్నారు.
ఈ మ్యాచ్ ఆడటానికి బీబీఎల్ జట్లు ఆసక్తి చూపాయి. వాటిలో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ వంటి జట్లు చెన్నైలో ఆడటానికి సుముఖంగా ఉన్నాయని తెలిపిందీ కథనం. ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టు ఈ సీజన్ ఓపెనర్లో పాల్గొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications