ది ఫైనల్ ఛాప్టర్: ఆ యువ ఆల్ రౌండర్ ను తీసుకుంటారా.. లేదా
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ క్లైమాక్స్కు చేరింది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ లో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఆఖరి మ్యాచ్.. ఈ సిరీస్ విజేతను తేల్చనుంది. తొలి వన్డేలో టీమిండియా గెలిచినప్పటికీ దాన్ని కొనసాగించలేకపోయింది. రెండో గేమ్ లో చతికిల పడింది. ఇంగ్లాండ్ పుంజుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. జోస్ బట్లర్ 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మ్యాచ్ అది. దీంతో ఈ చివరి మ్యాచ్.. సిరీస్ డిసైడర్ అయింది.
సిరీస్ విజయమే లక్ష్యంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. ఈ పరిస్థితుల మధ్య టీమిండియా తుదిజట్టులో కనీసం రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఇప్పటికే స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరం అయ్యాడు. అతని స్థానంలో హర్ష్ దూబే జట్టులోకి వచ్చాడు గానీ అతన్ని తుదిజట్టులోకి తీసుకోకపోవచ్చు. సుందర్ స్థానాన్ని చైనామన్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్తో భర్తీ చేయడం దాదాపు ఖాయమైనట్టే.

గత రెండు మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితం అయ్యాడు కుల్ దీప్. ఇక్కడి పిచ్ ఆరంభంలో స్పీడ్ బౌలర్లకు అనుకూలించినా మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు సహకరిస్తుంది. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్ దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. గూగ్లీ, ఫ్లైట్ డెలివరీలతో కుల్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడని మేనేజ్మెంట్ భావిస్తోంది.
మరోవైపు కీలకమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రానున్నాడు. కార్డిఫ్ లో జరిగిన రెండో వన్డేలో అతను అందుబాటులో లేడు. అతని స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రాహుల్ తిరిగి జట్టులోకి సమకూరితే మిడిలార్డర్ మరింత బలోపేతం అవుతుంది. సుందర్ దూరం కావడం ఆందోళన కలిగించినా గానీ కేఎల్ రాహుల్ పునరాగమనం జట్టుకు పెద్ద ఉపశమనంగా మారనుంది.
ఈ మ్యాచ్ లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరు అత్యంత కీలకం కానుంది. ఈ వన్డే సిరీస్ లోని రెండు మ్యాచ్ లలో రోహిత్ వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఎలాగైనా లార్డ్స్ లో భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు శుభారంభం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే. తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. లార్డ్స్ పిచ్ అతనికి అచ్చి రావట్లేదు కూడా. మూడు మ్యాచ్లలో 77 పరుగులు మాత్రమే చేశాడు.
సారథిగా ఓ ప్రతిష్టాత్మక విదేశీ వన్డే సిరీస్ను గెలుచుకునేందుకు కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఓ చక్కటి అవకాశం లభించింది. ఈ సిరీస్లో అతను బ్యాటింగ్ లో ఫామ్లో ఉన్నాడు. ఇక్కడ కూడా అతని నుంచి ఓ భారీ ఇన్నింగ్ ను ఆశించవచ్చు. అలాగే.. జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణతో కూడిన పేస్ దళం ఆరంభంలోనే ప్రత్యర్థి వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టగలిగితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయి.
ఇంగ్లాండ్ పై చివరిదైన మూడో వన్డే ఆడే టీమిండియా తుదిజట్టులో.. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, కుల్ దీప్ యాదవ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications