మీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు రా బై: టీమిండియాను ముంచుతున్నది వాళ్లే
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరో పరాభవం ఎదురైంది. నాటింగ్హామ్ ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఇంగ్లాండ్ బౌలర్ల ప్రతాపం ముందు కొమ్ములు తిరిగిన టీమిండియా బ్యాటర్లల్లో ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేకపోయారు. పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా టీమిండియా 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తడాఖా చూపింది. రెండో మ్యాచ్ లో విఫలమైన ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ఇక్కడ రెచ్చి పోయాడు. 44 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 70 పరుగులు చేశాడు. జోస్ బట్లర్- 31, సామ్ కర్రన్ 24 బంతుల్లో 41 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

అనంతరం 202 పరుగుల భారీ ఛేదనలో భారత్ ఆరంభం నుంచే ఒత్తిడిని ఎదుర్కొంది. బౌలర్ల ధాటికి భారత ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేయలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ అయిదు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేయగా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 13 పరుగులు సాధించి పెవిలియన్ చేరారు. వీరిద్దరు చేసిన ఈ స్కోరే భారత ఇన్నింగ్స్లో అత్యధికం కావడం గమనార్హం.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 7 బంతుల్లో ఒక సిక్సర్ సహాయంతో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిడిలార్డర్ బ్యాటర్ అక్షర్ పటేల్- 10 పరుగులకే సరిపెట్టుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన శ్రేయస్ అయ్యర్ అయిదు పరుగులకే వెనుదిరగ్గా తిలక్ వర్మ అంతకంటే అధ్వాన్నంగా ఆడాడు. మూడు పరుగులు మాత్రమే చేసినిరాశపరిచాడు. హర్షిత్ రాణా- 9, శివం దూబే- 2 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. 76 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. భారత్ పతనాన్ని పూర్తిగా శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. మరో పేసర్ జోఫ్రా ఆర్చర్ మూడు ఓవర్లలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లతో దెబ్బతీశాడు. వీరిద్దరి పేస్, బౌన్స్ ధాటికి భారత్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. సీనియర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీసుకోగా, విల్ జాక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ పిచ్లపై లభించే పేస్, ఎక్స్ట్రా బౌన్స్ను అంచనా వేయడంలో భారత యువ క్రికెటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పిచ్ ను చక్కగా వాడుకున్న ఇంగ్లాండ్ పేసర్లు ఇంటర్వెల్ అనేది లేకుండా వరుసగా వికెట్లు పడగొట్టారు.
ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఇతర ప్లేయర్లపై ట్రోల్స్ షురూ అయ్యాయి. వైభవ్ సూర్యవంశీనీ వదల్లేదు. ప్రత్యేకించి- సంజు శాంసన్ ను పక్కన పెట్టడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తోన్నారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం అయినా లేని వైభవ్ సూర్యవంశీని నేరుగా ఇంగ్లాండ్ పిచ్ లపై అరంగేట్రం చేయించడం పట్ల మండిపడుతున్నారు. బీసీసీఐ సెలెక్టర్లు పరోక్షంగా అతని కేరీర్ ను నాశనం చేశారంటూ ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications