U19 Asia Cup: ఐసీసీనీ లెక్కచేయని భారత్..! పాక్ తో మళ్లీ అదే సీన్..!
భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ లో ముఖాముఖీ తలపడిన ఇరుదేశాలూ ఆ తర్వాత శాంతించాయి. అయినా ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ తో ఎక్కడా ద్వైపాక్షిక టోర్నీల్లో క్రికెట్ ఆడకూడదని నిర్ణయించిన బీసీసీఐ..బహుళ జట్లు ఆడే టోర్నీలపైనా మరో నిర్ణయం తీసుకుంది. అది ఇవాళ్టికీ అమలవుతోంది.
పాకిస్తాన్ తో అంతర్జాతీయ టోర్నీల్లో ఎక్కడైనా తప్పనిసరిగా ఆడాల్సి వచ్చినా ప్రత్యర్ధి జట్టు కెప్టెన్లకు సంప్రదాయంగా ఇచ్చే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరాదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆసియా కప్ తో పాటు ఇతర టోర్నీల్లోనూ ఈ నిర్ణయాన్ని భారత కెప్టెన్లు అమలు చేస్తున్నారు. ఇవాళ దుబాయ్ లో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ భారత్-పాక్ మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టాస్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే నిరాకరించాడు.

అయితే ఐసీసీ మాత్రం ఈ టోర్నీకి ముందే అలా చేయొద్దంటూ బీసీసీఐని కోరింది. ఐసీసీ అండర్ 19 టోర్నీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని సూచించింది. అయితే టీమిండియా మాత్రం బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ పాకిస్తాన్ తో మ్యాచ్ లోనూ అమలు చేసింది. గతంలో పురుషుల సీనియర్ జట్టు ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టీ20 టోర్నీల్లో భారత ఆటగాళ్ళు పాకిస్తాన్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. ఇవాళ కూడా అదే ట్రెండ్ కొనసాగించారు.












Click it and Unblock the Notifications