రోహిత్ శర్మ-విరాట్ కొహ్లీకి నెక్స్ట్ అదే..! శుభ్ మన్ గిల్ కీలక సంకేతం..!
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తొలి రెండు వన్డేల్లో అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ తొలి రెండు వన్డేల్లో డకౌట్లతో వెనుదిరిగాడు. మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర్మ సెంచరీతో తిరిగి ఫామ్ లోకి రాగా.. విరాట్ కొహ్లీ కూడా 74 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇవాళ కీలక సంకేతం ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోవడానికి కారణమైన అంశాల్లో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తొలి రెండు వన్డేల్లో విఫలం కావడం కూడా ఉంది. వీరిద్దరు అంచనాలకు అనుగుణంగా రాణించి ఉంటే ఈ సిరీస్ ఫలితం మరోలా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. అయితే చివరి మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం ద్వారా భారత్ ను గెలిపించినా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఈ నేపథ్యంలో రొహిత్-కొహ్లీ జోడీ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్ మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరినీ బీసీసీఐ త్వరలో దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

అయితే దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరగలేదని, స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కు పెద్దగా గ్యాప్ లేదని శుభ్ మన్ గిల్ తెలిపాడు. దక్షిణాఫ్రికా ,, న్యూజిలాండ్ సిరీస్ల మధ్య కొంచెం గ్యాప్ ఉందన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ఈ అంశంపై చర్చలు జరుపుతామని శుభ్మాన్ గిల్ వెల్లడించాడు. ఏడాది, రెండు సంవత్సరాల క్రితం ఆటగాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడల్లా వారు దేశీయ క్రికెట్ ఆడాలని తాము స్పష్టం చేశామని గిల్ గుర్తుచేశాడు. నా ఉద్దేశ్యం మీకు తగినంత విరామం ఉంటే, మిమ్మల్ని మీరు పదునుగా ఉంచుకోవడానికి, క్రికెట్ ఆడటానికి అదే ఏకైక మార్గం అన్నాడు. 2025-26 సీజన్ కోసం, విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24న ప్రారంభమవుతుందని తెలిపాడు.

అంటే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడి తీరాలని గిల్ స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. ఈ మేరకు బీసీసీఐ వారిని అధికారికంగా ఈ విషయంపై దిశానిర్దేశం చేస్తుందని గిల్ పరోక్షంగా సంకేతం ఇచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిశాక బీసీసీఐతో గిల్ చర్చించాక దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications