2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకున్న స్టార్ ఆల్రౌండర్
ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. జనవరిలో ఇవి షెడ్యూల్ అయ్యాయి. మొత్తం 350 స్థానాలు ఉన్న ఆ దేశ పార్లమెంట్ జాతీయ సంగ్సద్ (House of Nation)కు జరిగే 12వ విడత ఎన్నికలివి.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆవామీ లీగ్ అధికారంలో ఉంది. పార్లమెంట్లో ఆ పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 306. ఈ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి ఉన్న స్థానాల సంఖ్య 27. భారత్ తరహాలోనే అయిదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయక్కడ.

ఈ సారి కూడా ఆవామీ లీగ్ అధికారంలోకి రావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. షేక్ హసీనా తన బాధ్యతల నుంచి తప్పుకొని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తటస్థ వ్యవస్థకు అప్పగించాలనేది ఆ పార్టీ డిమాండ్.
ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) పోటీ చేయనున్నాడు. మగుర-1 నియోజకవర్గం నుంచి ఎన్నికల రేసులో నిల్చోనున్నాడు. అధికార ఆవామీ లీగ్ తరపున నామినేషన్ వేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. షకీబల్ హసన్ అభ్యర్థిత్వాన్ని ఆవామీ లీగ్ జాయింట్ సెక్రెటరీ జనరల్ బహవుద్దీన్ నసీమ్ ఖరారు చేశారు. రాజకీయాల్లోకి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో షకీబ్కు టికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదివరకు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ముష్రఫీ మొర్తాజా రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 2009లోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడిగా పని చేస్తోన్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన విషయం తెలిసిందే. లీగ్ దశలోనే ఆ జట్టు వెనుదిరిగింది.












Click it and Unblock the Notifications