శ్రీలంక- ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో తీవ్ర విషాదం: జయసూర్య
ఆసియా కప్ 2025లో శ్రీలంక ఆల్రౌండర్ దునిత్ వెల్లలగేకు తీవ్ర విషాదం ఎదురైంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ అనంతరం అతని తండ్రి సురంగ వెల్లలగే గుండెపోటుతో మరణించినట్లు సమాచారం అందింది. ఆయన వయసు 54 సంవత్సరాలు. అబుదాబి స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సూపర్ 4 దశకు అర్హత సాధించిన కొద్దిసేపటికే వెల్లాలగేకు అతని తండ్రి మరణవార్త అందింది. తండ్రి కన్నుమూసిన విషయాన్ని శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య తెలియజేశారు. ఈ దుర్వార్త వినగానే దునిత్ వెంటనే ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. దీంతో అతను ఆ టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లలో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.

దునిత్ వెల్లలగే తండ్రి సురంగ మరణించిన విషయాన్ని శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రస్తావించారు. ఆయనకు నివాళి అర్పించారు. గతంలో సురంగ కూడా క్రికెట్ ఆడాడని గుర్తు చేశారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీ జట్టుకు కేప్టెన్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ వార్త దునిత్కు ఇప్పుడే తెలిసిందని, కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోన్నానని చెప్పారు. సూపర్ 4లో అడుగుపెట్టిన విజయోత్సవాలు జట్టు జరుపుకోవట్లేదని అన్నారు. దునిత్ తండ్రి మరణించడం పట్ల శ్రీలంక మాజీ క్రికెటర్ కేప్టెన్ లసిత్ మలింగ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ విషాద వార్త శ్రీలంక జట్టులో విషాదఛాయలు నింపింది. వెల్లలగేకు అయిదో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ తోనే ఆసియా కప్ లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో ఒత్తిడికి గురయ్యాడు. రాణించలేకపోయాడు. తన నాలుగు ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో మహమ్మద్ నబీ అయిదు సిక్సర్లు కొట్టాడు. నిమిషాల వ్యవధిలో జట్టు విజయాన్ని ఆస్వాదించడం నుండి వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొనే వరకు అతని జీవితం మారిపోయింది.












Click it and Unblock the Notifications