టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్: సూపర్ 8 చేరిన ఆ టీమ్
T20 World Cup 2024 Super 8: టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్ న్యూజిలాండ్.. ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సూపర్ 8 చేరకుండానే వైదొలగింది. దాని స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8కు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గ్రూప్ సీలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టుబొగోలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పపువా న్యూగినియాను ఓడించింది ఆఫ్ఘనిస్తాన్. సూపర్ 8 చేరుకోవడానికి అవసరమైన అరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గ్రూప్ సీలో టేబుల్ టాపర్గా నిలిచిన జట్టు ఇదే.

ఇదివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లో ఉగాండా, న్యూజిలాండ్లను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. నాలుగు పాయింట్లను సాధించింది. తాజాగా పపువా న్యగినియాను ఓడించడంతో పాయింట్ల సంఖ్య మెరుగుపడింది. ఆరుకు చేరింది. సూపర్ 8కు చేరడానికి అవసరమైన ఆరు పాయింట్లను అందుకోగలిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా.. 19.5 ఓవర్లల్లో 95 పరుగులకే ఆలౌట్ అయింది. టీమ్ మొత్తం మీద ముగ్గురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. కిప్లిన్ డొరిగా- 27, అలెయ్ నావో- 13, ఓపెనర్ టోనీ ఉరా- 11 పరుగులు చేశారు. వారందరి కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఇచ్చిన ఎక్స్ట్రాలే అధికంగా ఉండటం ఈ మ్యాచ్ హైలైట్. ఇన్నింగ్ మొత్తం మీద 25 ఎక్స్ట్రాలు ఇచ్చారు ఆఫ్ఘన్ బౌలర్లు. ఇందులో 12 లెగ్బై, 13 వైడ్స్ ఉన్నాయి.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 15.1 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ గుల్బదీన్ నబీ చెలరేగాడు. 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అజ్మతుల్లా ఒమర్జాయ్- 13, మహ్మద్ నబీ- 16 పరుగులతో అతనికి అండగా నిలిచారు.
గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. సూపర్ 8కు చేరుకున్నాయి. గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, గ్రూప్ బీ- ఆస్ట్రేలియా, గ్రూప్ ఏ నుంచి భారత్.. సూపర్ 8 చేరిన జట్లుగా నిలిచాయి. ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం అమెరికా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్.. పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్కూ ఆ అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications