Vaibhav Suryavanshi: క్రికెట్టా ? బోర్డు పరీక్షా ? తేల్చేసిన వైభవ్ సూర్యవంశీ..!
క్రికెట్లో తన పరుగుల వేటతో దుమ్మురేపుతున్న బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు దేశంలోనే అత్యంత బిజీ క్రికెటర్. అయితే చదువు మధ్యలో క్రికెట్ పై పూర్తిగా శ్రద్ద పెట్టిన వైభవ్.. ఇప్పుడు పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఇప్పటికే సూర్యవంశీకి అడ్మిట్ కార్డు కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి సమయంలో క్రికెట్టా, లేక పరీక్షా ఏది కావాలంటే వైభవ్ సూర్యవంశీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
ఈ ఏడాది పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కాకూడదని వైభవ్ సూర్యవంశీ నిర్ణయించుకున్నాడు. బిజీ క్రికెట్, ప్రాక్టీస్, నెట్ క్యాంప్స్ ఇలా క్షణం తీరికలేకుండా ఉన్న వైభవ్.. పదో తరగతి పరీక్షలపై దృష్టిసారించే పరిస్ధితుల్లో లేడని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదికి పదో తరగతి బోర్డు పరీక్షలకు డుమ్మా కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు తాను చదువుతున్న బీహార్లోని స్కూలుకు కూడా సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

బీహార్లోని తాజ్పూర్ నివాసి అయిన వైభవ్ సూర్యవంశీ.. స్థానిక మోడెస్టీ స్కూల్ లో చదువుతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకూ జరిగే బోర్డు పరీక్షలకు వైభవ్ హాజరు కావాల్సి ఉంది. అయితే బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా అతను ఇంటికి, పాఠశాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఇది బోర్డు పరీక్షకు అతని సన్నాహాలను ప్రభావితం చేసిందని తెలుస్తోంది. ఈ మేరకు అతను చదువుతున్న మోడెస్టీ స్కూల్ తాజ్పూర్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార్ పింటూ వివరాలు వెల్లడించారు.

వైభవ్ పరీక్షా ఫారం నింపి, అడ్మిట్ కార్డు కూడా జారీ చేయబడిందని ఆయన తెలిపారు. స్ధానిక పోద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పరీక్ష కేంద్రం కూడా ఇచ్చారు. అయితే వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీతో జరిగిన సంభాషణ తర్వాత.. అతను ఈ సంవత్సరం పరీక్షకు హాజరు కాకూడదని నిర్ణయించారని వెల్లడించారు. తాజాగా అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ సాధించిన అద్భుత విజయాల్లో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు.












Click it and Unblock the Notifications