కలిసొస్తున్న కాలం
హైదరాబాద్: హైదరాబాద్లో అమెరికన్ కాన్సలేట్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ప్రకటించడంతో వైఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న విజయాల్లో మరొకటి వచ్చి చేరింది. గతంలో బిల్ క్లింటన్ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకున్న తప్పుడు ప్రచారం వికటించింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జార్జి బుష్కు ఎక్కువగా గ్రామీణాంధ్రప్రదేశ్ గురించి వివరించడానికి ప్రయత్నించింది. అమెరికాలో గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉన్న జార్జి బుష్కు రాష్ట్రాల సాధక బాధకాలేమిటో బాగా తెలుసు. అలాగే అమెరికాలో పనిచేస్తున్న ఐటి నిపుణుల్లో రాష్ట్రానికి చెందిన వారు గణనీయంగా ఉన్నారన్న విషయం కూడా బాగా తెలుసు.
జార్జి బుష్ రాష్ట్ర పర్యటనలో అమెరికా వ్యాపార ప్రయోజనాల మాట ఎలా ఉన్నా ఆయన ఇక్కడ బాగా నటించారు. నాగలి మేశారు. పనస కాయను చేతులతో పైకెత్తారు. బాగా నల్లగా ఉన్న ఒక పాపను ఎత్తుకున్నారు. ఇలా చేయడమే కాదు, భారతదేశం డిమాండ్లకు సంబంధించి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు అక్కడి సెనేటర్లపై వత్తిడి తేవాలని కూడా బుష్ వైఎస్కు సూచించారు. ముఖ్యంగా హిల్లరీ క్లింటన్ను ఒప్పించమని ఆయన కోరడం విశేషం. హుస్సేన్సాగర్ను విమానం నుంచి చూసిన బుష్ నగరానికి మంచి నీరు ఇక్కడి నుంచే వస్తుందా అని వైఎస్ను ప్రశ్నించడం, హుస్సేన్సాగర్ను శుద్ధి చేయడానికి మూడు వందల కోట్లు కావాలని ఆయన సూచించడం మరొక విశేషం. అమెరికా అధ్యక్షులు ఎవరైనా మన దేశానికి వచ్చినప్పుడు ఆయనను వరాలు ప్రసాదించే పరమ శివుడిగా పరిగణించడం మామూలే.
వామపక్షాలు, ప్రజాసంఘాలు, ముస్లిం పార్టీల నిరసనల మధ్య బుష్ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన బిల్ క్లింటన్ హైటెక్ దారి పట్టినా, జార్జి బుష్ మాత్రం పల్లె బాట పట్టారు. ఒకప్పుడు హాబీగా వ్యవసాయం చేపట్టిన బుష్ దంపతులకు వ్యవసాయంలోని సాధక బాధకాలు బాగా తెలుసు. మాకు వ్యవసాయం తెలుసు. మార్కెటింగ్ తెలియదు అని ఆయన ఛమత్కరించారు. దీనిని బట్టి ఆమెరికా మన వ్యవసాయ రంగానికి వ్యతిరేకం కాదని, చంద్రబాబు నాయుడిని కొందరు అధికారులు తప్పు పట్టించారని అర్ధమవుతోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం తగ్గించమని ప్రపంచబ్యాంకు వత్తిడి తెస్తోందన్న విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు. అవన్నీ వట్టి భ్రమలని నేటి బుష్ పర్యటన నిరూపించింది.












Click it and Unblock the Notifications
