కలిసొస్తున్న కాలం
జార్జి బుష్ రాష్ట్ర పర్యటనలో అమెరికా వ్యాపార ప్రయోజనాల మాట ఎలా ఉన్నా ఆయన ఇక్కడ బాగా నటించారు. నాగలి మేశారు. పనస కాయను చేతులతో పైకెత్తారు. బాగా నల్లగా ఉన్న ఒక పాపను ఎత్తుకున్నారు. ఇలా చేయడమే కాదు, భారతదేశం డిమాండ్లకు సంబంధించి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు అక్కడి సెనేటర్లపై వత్తిడి తేవాలని కూడా బుష్ వైఎస్కు సూచించారు. ముఖ్యంగా హిల్లరీ క్లింటన్ను ఒప్పించమని ఆయన కోరడం విశేషం. హుస్సేన్సాగర్ను విమానం నుంచి చూసిన బుష్ నగరానికి మంచి నీరు ఇక్కడి నుంచే వస్తుందా అని వైఎస్ను ప్రశ్నించడం, హుస్సేన్సాగర్ను శుద్ధి చేయడానికి మూడు వందల కోట్లు కావాలని ఆయన సూచించడం మరొక విశేషం. అమెరికా అధ్యక్షులు ఎవరైనా మన దేశానికి వచ్చినప్పుడు ఆయనను వరాలు ప్రసాదించే పరమ శివుడిగా పరిగణించడం మామూలే.
వామపక్షాలు, ప్రజాసంఘాలు, ముస్లిం పార్టీల నిరసనల మధ్య బుష్ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన బిల్ క్లింటన్ హైటెక్ దారి పట్టినా, జార్జి బుష్ మాత్రం పల్లె బాట పట్టారు. ఒకప్పుడు హాబీగా వ్యవసాయం చేపట్టిన బుష్ దంపతులకు వ్యవసాయంలోని సాధక బాధకాలు బాగా తెలుసు. మాకు వ్యవసాయం తెలుసు. మార్కెటింగ్ తెలియదు అని ఆయన ఛమత్కరించారు. దీనిని బట్టి ఆమెరికా మన వ్యవసాయ రంగానికి వ్యతిరేకం కాదని, చంద్రబాబు నాయుడిని కొందరు అధికారులు తప్పు పట్టించారని అర్ధమవుతోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం తగ్గించమని ప్రపంచబ్యాంకు వత్తిడి తెస్తోందన్న విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు. అవన్నీ వట్టి భ్రమలని నేటి బుష్ పర్యటన నిరూపించింది.