ఎన్టీఆర్ వారసులెవరు?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే;/SPAN> జనరల్ 19-01-2006 ;?
హైదరాబాద్: తెలుగుదేశం వ్యవస్ధాపకుడు నందమూరి తారకరామారావుకు నిజమైన వారసులు ఎవరు? ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించి తొమ్మిదేళ్ళ పాటు టిడిపి ముఖ్యమంత్రిగా అధికారం చలాయించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడా? ఎన్టీఆర్ను గద్దె దింపడానికి ఆయన కుమారుడు హరికృష్ణ, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహా కుటుంబ సభ్యులంతా ఆనాడు చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో వారి ఉమ్మడి శత్రువు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా దగ్గుబాటి, హరికృష్ణ చంద్రబాబు నాయుడికి గుడ్బై చెప్పి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టుకుని ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత హరికృష్ణ రాజకీయాలు విడిచిపెట్టారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. ఎంపీగా పురంధరేశ్వరి, ఎమ్మెల్యేగా దగ్గుబాటి పోటీచేసి గెలిచారు. వీరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీ అగ్ర నాయకులు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. టిడిపిలో ఎన్టీఆర్, కూతురికీ అల్లుడికీ స్ధానం లేదంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా దుర్మార్గుడన్న సంకేతాలు సామాన్యప్రజల్లోకి వెళ్ళాయి. కొన్ని కోస్తా జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీచడానికి ఇది కూడా ఒక కారణం. పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి దీనిని ఇంకా బల పరచుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆలోచనగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని నిన్న చంద్రబాబు నాయుడు లొల్లి చేస్తున్న సమయంలో పురంధరేశ్వరి చాలా కూల్గా వైఎస్తో మాట్లాడి ఆ పని చేయించారు. ఆ విషయం తెలియని చంద్రబాబు నాయుడు మరో అరగంట సేపు ఆందోళన నిర్వహించడం విశేషం.
ఎన్టీఆర్ను తొలగించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి కొన్ని పెద్ద శక్తులు దోహదపడ్డాయి. కొన్ని వ్యాపార ప్రయోజనాల కోసం కొందరు ఎన్టీఆర్ను దెబ్బతీశారు. లక్ష్మీపార్వతి బూచిని చూపించి ఎమ్మెల్యేలను కూడగట్టారు. మొదటి టెర్మ్ చంద్రబాబు నాయుడు బాగానే పనిచేసినప్పటికీ, రెండో టెర్మ్లో అతి విశ్వాసంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని సామాన్యప్రజలకు దూరమయ్యారు. ఎన్టీఆర్ సామ్యవాద సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడంతో తెలుగుదేశం ప్రభుత్వం సంపన్నులదే కానీ సామాన్యులది కాదన్న సంకేతాలు జనంలోకి వెళ్ళాయి. రాష్ట్ర ప్రజలందరూ ఒక చోట కూర్చుని కూడబలుక్కున్న చందంగా తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు.
నిన్న ఎన్టీఆర్ పదో వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు, లక్ష్మీ పార్వతి విడివిడిగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వీరు కాకుండా దగ్గుబాటి, పురంధరేశ్వరి విడిగా నివాళి ఘటించారు. బాలకృష్ణ విజయవాడలో మరో సభలో తండ్రిని సంస్మరించుకున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు ఎన్టీఆర్కు నిజమైన వారసులు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్టీఆర్ రాజకీయ, ఆర్ధిక విధానాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుసరించడం లేదు. నిజానికి ఎన్టీఆర్కు బహిరంగంగా నివాళి ఘటించే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి ఉండకూడదు. ఎన్టీఆర్ తన జీవితాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు కాబట్టి ఆయన కుమార్తె పురంధరేశ్వరి కూడా ఆయన రాజకీయ వారసురాలు కాదు. స్వార్ధంతో ఎన్టీఆర్ పేరును భ్రష్టు పట్టించిన లక్ష్మీపార్వతికి కూడా ఆయన పేరును ఉచ్ఛరించే అర్హత ఉండకూడదు. ఇది క్షీణ విలువల యుగం. ఇంతకంటే ఇంకేమీ చెప్పుకోలేం.
ఇటీవలి కథనాలు హోంపేజి