చిరు మరో షెడ్యూలు

ఉత్తరాంధ్రలో చిరంజీవి యాత్రలు సూపర్ హిట్ అయ్యాయనడంలో ఆశ్చర్యం లేదు. రోడ్ షోలలో ప్రజలు కనబరిచిన ఆదరణను అధ్యయనం చేసిన ప్రజారాజ్యం మేధావులు పొత్తుల విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఆ ప్రకటనలు వామపక్షాలనే ఖంగు తినిపించాయి. టీఅర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు మరో పక్క చిరంజీవి తెలంగాణ యాత్రల ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదని టీఅర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ప్రాంత సమస్యల మీద చిరంజీవి ఇప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో నిర్వహించనున్న రోడ్ షోలలో ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్టృం గురించి స్పష్టమైన వైఖరితో మాట్లాడవలసిందే. లేకపోతే ఈ ప్రాంతంలో ఆయన పర్యటనలు నిరర్ధకమవుతాయి. అందువల్లనే చిరంజీవి పక్కా స్క్రిప్టును సిద్ధం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఏఏ అంశాలు హైలైట్ ఆయ్యాయో, ఏ అంశాలు పెద్దగా స్పందనకు నోచుకోలేదో ప్రజారాజ్యం పరిశీలకులు నిశితంగా విశ్లేషించి, సంక్షిప్త నివేదికను చిరంజీవికి సమర్పించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరహాలో అదే పనిగా జనాకర్షణ పథకాలను ప్రకటించకుండా రాష్ట్ర ప్రజలందరి హృదయాలను సమానంగా తాకగల కొన్ని నినాదాలను రూపొందించుకోలసి ఉంది. అవినీతిపై సమరం అనే నినాదమొక్కటే సరిపోదు.
ఇక మీదట అధికార కాంగ్రెస్ పార్టీ చిరంజీవిపై అఫెన్సివ్ గా ప్రచారం చేసే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను డిఫెన్స్ లో పడేయాలంటే ఈ రెండు పార్టీల హయాంలో జరిగిన కుంభకోణాలను బుక్ లెట్ లుగా ప్రజల ముందుకు తేవలసిన అవసరముంది.












Click it and Unblock the Notifications