ఇప్పుడు ఎన్టీఆరే కీలకమా?
హరికృష్ణ మొదటి భార్య జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య లాబీయింగ్ చేస్తుండడంతో స్పర్ధలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య (కులాంతర వివాహం) కుమారుడన్న విషయం అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ భారతంలో కర్ణుడిలాగా అవమానాలు ఎదుర్కొన్నాడని, అతను సినిమాల్లో ఎదిగి వచ్చిన తర్వాతే తండ్రి హరికృష్ణ దగ్గరకు చేర్చుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.
మొదటి నుంచి తల్లి ప్రేమ, వాత్సల్యాలే తప్ప తండ్రి నుంచి ఆప్యాతకు పెద్దగా నోచుకోని జూనియర్ పై తల్లి ప్రభావం ఎక్కువ. తమకు తగిన ఆదరణ లేని సువిశాల నందమూరి కుటుంబం అంటే జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే అభిప్రాయం జూనియర్ లో కూడా నాటుకుపోయింది. అవసరమైనప్పు కలుపుకోవడం, అవసరం లేనప్పుడు దూరంగా పెట్టడం చంద్రబాబు నాయుడు నైజమన్న విషయం బాగా ప్రచారంలో ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడిని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే తన కుమారుడి కెరియర్ పాడవుతుందని ఆ తల్లి ఆందోళన. అతి చిన్న వయసులోనే హీరోగా మంచి స్ధాయికి ఎన్టీఆర్ ఎదగడం వెనుక అతని ప్రతిభతో పాటు తల్లి అండదండలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని కోరిన గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద విశేషాలు ఏమీ లేవు. గుడివాడలో ఎన్టీఆర్ కోరుతున్న కొడాలి నాని ఇప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే. గన్నవరం టికెట్ ను తన తాజా సినిమా నిర్మాత వంశీమోహన్ కు ఇవ్వాలని ఎన్టీఆర్ బాబును కోరారు. అందుకు బాబు అంగీకరించింది లేనిది స్పష్టం కావడం లేదు. ఎందుకంటే అదే టికెట్ ను దాసరి బాలవర్ధనరావుకు ఇప్పించుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ పంతం. తెలుగుదేశం టికెట్ కు ఎక్కడా లేనంత పోటీ గన్నవరంలో ఏర్పడింది. కళ్యాణ్ రామ్ వాదనను హరికృష్ణ సమర్ధించడంతో కుటుంబ సినిమాలో ఇంటర్వల్ బ్రేక్ పడింది.
జూనియర్ ఎన్టీఆర్ కు జనంలో ఉన్న ఫాలోయింగ్ గురించి బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఆయనతో ముఖ్యమైన స్ధానాల్లో ప్రచారం చేయించుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. జూనియర్ అంటే ఆగ్రహంగా ఉన్న హరికృష్ణ మొదటి భార్యను ఒప్పించే బృహత్ కార్యాన్ని బాబు తన సతీమణి భువనేశ్వరికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో తెలుగుదేశం గెలుపు ముఖ్యమని, కుటుంబ ప్రయోజనాలకు అది చాలా అవసరం కాబట్టి విభేదాలను తాత్కాలింకంగా అయినా పక్కకు పెట్టుకోవాలను భువనేశ్వరి తన కుటుంబసభ్యులందరికీ చెబుతున్నట్టు తెలిసింది.
సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పుడు రామాయణ, భారత గాధలు నడుస్తున్నాయి. ఆ పౌరాణిక కథానాయకుడు ఈ పరిణామాలకు పై నుంచి ఆనందపడతారో, బాధ పడతారో ఒకసారి ఆలోచించండి.