మెదక్ నుంచి ప్రియాంక?

ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రాంతమైన మెదక్ నుంచి పోటీ చేస్తే ఆమె ప్రభావం తెలంగాణ అంతటా కాంగ్రెస్ అభ్యర్ధులపై ఉంటుందని, గాలి వీస్తే అన్ని లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలుగుతుందని వైఎస్ కోటరీ ఒక చక్కటి, చిక్కటి స్కెచ్ ను సోనియాగాంధీకి అందజేసినట్టు సమాచారం. గతంలో లాగా ప్రియాంకకు ఇప్పుడు రాజకీయాల మీద ఏహ్యభావం లేదు. పైగా ఆమె సోదరుడు రాహుల్ ను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. సోనియాగాంధీ, రాహుల్ ఇద్దరూ ఉత్తరాది నుంచి పోటీ చేస్తున్నందువల్ల దక్షిణాది నుంచి కూడా నెహ్రూ కుటుంబానికి ప్రాతినిధ్యం ఉండాలన్న వాదన కూడా ఉంది.
ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంపై ఒక ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, లోక్ సభలో కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, లోక్ సభ సభ్యుడు మధు యాష్కి, పిసిసి మాజీ అధ్యక్షుడు కేశవరావు ప్రత్యేక తెలంగాణ కోసం అంతర్గతంగానే అధిష్టానవర్గంపై వత్తిడి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమని టీఅర్ ఎస్ అధినేత కెసీఅర్ ఇప్పటికీ అంటున్నారు.
కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంతో బలంగా ఉందని వైఎస్ అధిష్టానవర్గానికి చెబుతూ వస్తున్నారు. ఆయన తన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపధ్యంలో వైఎస్ వీర విధేయ మేధావులైన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు "ప్రియాంక్- మెదక్" ఫార్ములాను తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మెదక్ స్ధానానికి ఒకప్పటి టీఅర్ ఎస్ నేత నరేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రియాంక రంగంలోకి దిగితే ఆయనకు డిపాజిట్లు దక్కడం కష్టమన్న అభిప్రాయం ఉంది. టిడిపి, ఉభయ కమ్యూనిస్టులు, టీఅర్ ఎస్ ల ఉమ్మడి అభ్యర్ధి రంగంలో ఉన్నా అత్యధిక మెజారిటీతో ప్రియాంక గెలుపొందుతారని వైఎస్ వర్గీయుల అంచనా. ఆలోచనలు అద్భుతంగానే ఉంటాయి. ఆచరణలో ఏమవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications