జగన్ ప్రకటనతో ప్రకంపనలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 63 రోజుల పాటు ఓదార్పు యాత్ర చేసిన జగన్ నెల్లూరు సభలో తన రాజకీయాలకు ట్విస్టు ఇచ్చారు. అధిష్టానం మాటను వినాల్సిన అవసరం లేదని మరోసారి చాటి చెప్పారు. అధిష్టానం తన దారికి వచ్చి తనను అందలం ఎక్కించాల్సిందేననే పద్ధతిలో మాట్లాడారు. ఆయన తీరుపై కాంగ్రెసు పార్టీవారే కాకుండా తెలుగుదేశం పార్టీ వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఆయన ఒక్క మాట అనకున్నా తెలుగుదేశం నాయకులు ఉలిక్కిపడడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైయస్ జగన్ తో చేతులు కలిపి ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం క్యాడర్ కూడా జగన్ వైపు వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో క్యాడర్ ను కాపాడుకోవడానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తంటాలు పడుతున్నారు.
వైయస్ జగన్ తీరుపై పార్టీ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి సదస్సుకు డుమ్మా కొట్టి, ఓదార్పు యాత్ర చేయడమే కాకుండా, చివరలో వాగ్బాణాలు సంధించడాన్ని పార్టీ అధిష్టానం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదనే విషయాన్ని వారు చెప్పదలుచుకున్నట్లు సమాచారం. ఈ స్థితిలో జగన్ పై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.