వైయస్ జగన్ ది చిరంజీవి స్థితే
వైయస్ జగన్ పక్కన తెలంగాణ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, మాజీ శాసనసభ్యడు బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వంటివారు మాత్రమే ఉన్నారు. వైయస్ జగన్ కు తిరుగులేని మద్దతును వారు ప్రకటిస్తున్నారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం ప్రకటిస్తే తప్ప ఫలితం ఉండదు. వైయస్ జగన్ చేత తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిస్తామని తెలంగాణ నాయకులు అంటున్నారు. అయితే, వైయస్ జగన్ అంత స్పష్టంగా ముందుకు వస్తారా అనేది అనుమానమే. తెలంగాణ ఇచ్చేది తాను కాదు, తెచ్చేది తాను కాదని, తెలంగాణ ఇస్తానంటే తాను వ్యతిరేకించబోనని, దాన్ని అడ్డుకునే శక్తి కూడా తనకు లేదని మాత్రమే ఆయన చెప్పే అవకాశాలున్నాయి. ప్రస్తుత వాతావరణంలో ఆ మాటలతో తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందే అవకాశాలు లేవు. తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే సమర్థిస్తామని చెప్పిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి లాంటి వారే వెనక్కి మళ్లారు. అందువల్ల వైయస్ జగన్ కట్టె విరగకుండా, పాము చావకుండా వైఖరి ప్రకటిస్తే ఏ మాత్రం ఫలితం ఉండదు. దాంతో ఆయన నెట్టుకు రావడం కష్టమే అవుతుంది.
ఇకపోతే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. ఇది అన్ని పార్టీలకు కూడా కొరకరాని కొయ్యగానే ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చిరంజీవి ఎటూ తేల్చకుండానే నెట్టుకొచ్చారు. కానీ వైయస్ జగన్ పరిస్థితి అలా ఉండేట్లు లేదు. తప్పకుండా ఆయన ఏదో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి ఉంది. అయితే, వైయస్ జగన్ కు అంత వెసులుబాటు ఉండేట్లు లేదు. వైయస్ జగన్ పక్కన మాల నాయకులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మాల నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు వంటి మాల నాయకులు వైయస్ జగన్ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. అయితే, వైయస్సార్ పై ఉన్న అభిమానం, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తనకు కలిసి వస్తాయని, మిగతా విషయాలు ప్రధానం కాదని వైయస్ జగన్ అనుకోవచ్చు. కానీ ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత ఇతర అంశాలు కూడా ముందుకు వస్తాయి.