దాసరిపై చిరంజీవి ఎఫెక్ట్
చిరంజీవిని దగ్గరు చేసుకోవడానికి ఎన్నికల తర్వాత ప్రయత్నాలు ప్రారంభించే క్రమంలో దాసరి నారాయణ రావును మరింతగా దూరం పెడుతూ వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయించడానికి మంతనాలు ప్రారంభించారు. వైయస్ తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ చిరంజీవితో చర్చలు జరుపుతూ వచ్చారు. చిరంజీవితో స్నేహం చేసే ప్రయత్నాలు వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తరుచుగా చెబుతూనే ఉన్నారు. అయితే, తాజాగా పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చిరంజీవిని కులుపుకోవాల్సిన అవసరంపై వైయస్ సోనియా గాంధీకి రాసిన లేఖను బయటపెట్టడంతో ఆ విషయం నిర్ధారణ అయింది.
చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి తెచ్చే క్రమంలోనే దాసరి నారాయణ రావు మంత్రి పదవి కూడా పోయిందని చెబుతున్నారు. ఒక చోట రెండు అధికార కేంద్రాలు సాధ్యం కావు కాబట్టి చిరంజీవి తీసుకు రావడానికి తప్పనిసరిగా దాసరి నారాయణ రావు ప్రాబల్యాన్ని తగ్గించాల్సిన పరిస్థితిలో కాంగ్రెసు అధిష్టానం పడింది. దానిపై తీవ్రంగా మనస్తాపానికి గురైన దాసరి నారాయణ రావు తన ఆవేదనను ఓ సభలో వ్యక్తం చేశారు కూడా. అయితే, కారణాలను, అంతర్గత విషయాలను ఆయన బయటపెట్టలేదు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తనను దూరం చేయడంతో దాసరి నారాయణ రావు ఒక రకంగా కోపంగా ఉన్నారని కూడా అంటున్నారు. అందువల్ల ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణతో పరమవీర చక్ర తీశారని చెబుతారు. దాసరి నారాయణ రావు తీసిన బెబ్బులిపులి సినిమా ఎన్టీ రామారావుకు రాజకీయాల్లో ఆధిపత్యం సాధించడానికి తోడ్పడింది. అదే స్థాయిలో బాలకృష్ణ పరమవీర చక్ర సినిమా ఉంటుందనే సంకేతాలు కూడా దాసరి ఇచ్చారు. కానీ, అది కూడా తగిన ఫలితాలు ఇవ్వలేదు.