వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ను రెచ్చగొట్టే వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను రెచ్చగొట్టే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. వైయస్ జగన్‌ను రెచ్చగొట్టడం ద్వారా ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యులను రాజీనామాలకు ఉసిగొల్పాలనేది ఆ వ్యూహంగా అనుకోవచ్చు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అస్థిరం పాలైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ వర్గం శాసనసభ్యులతో రాజీనామాలు చేస్తే ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ నిరూపణకు అవసరమైన సంఖ్యాబలం తగ్గుతుంది.

ప్రస్తుతం గట్టెక్కాలంటే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని వారిపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం తీవ్ర విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే తెలంగాణకు అనుకూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న శాసనసభ్యులపై ఎందుకు అనర్హత వేటు వేయరనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని పరిష్కరించుకోవడానికి జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వారంత వారు రాజీనామా చేసేలా రెచ్చగొట్టడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. ఆయనకు తోడుగా పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కడప జిల్లాకు చెందినవారు కావడం విశేషం. అంతేకాకుండా వీరిద్దరు కూడా ఒకప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైయస్సార్ జీవించి ఉన్నంత కాలం మౌనంగా ఉన్న వీరు ఇప్పుడు వైయస్ జగన్‌కు ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్‌ను ఎదుర్కునేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి సహకారంతో కడప జిల్లాలో వైయస్ జగన్‌ను దెబ్బ తీసేందుకు పావులు కదుపుతున్నారు. వైయస్ జగన్‌ను రెచ్చగొట్టే వ్యూహంలో భాగంగానే డిఎల్ రవీంద్రా రెడ్డి జగన్ వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెసు శాసనసభ్యులను రాజీనామాల ఉచ్చులోకి లాగుతున్నారని అంటున్నారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, జగన్ వెంట వెళ్తున్న ఐదుగురు కడప జిల్లాకు చెందిన శాసనసభ్యులు కూడా రాజీనామా చేయాలని ఆయన అంటున్నారు.

ఈ నెల 20 తర్వాత ఆయన రాజీనామా సమర్పించడానికి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అపాయింట్‌మెంటు కూడా తీసుకున్నారు. కడప జిల్లా శాసనసభ్యుల గందరగోళం నడుస్తున్న తరుణంలో వైయస్ జగన్ వెంట వెళ్తున్న మిగతా శాసనసభ్యులపై ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై ముందుకు సాగవచ్చునని అనుకుంటున్నారు. ఇప్పటికే, చాలా మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వారిని తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానం జగన్ విషయంలో ప్రమాదకరమైన డ్రామాకే తెర తీసిందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X