మీడియాపై గుర్రుమంటున్న వర్మ
తన సినిమాలో తెలుగు సినిమాపై దుమ్మెత్తి పోసిన వర్మ ఓ టీవీ చానల్ తనను ఉతికి ఆరేస్తోందని ఆవేదన చెందారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్కు ఫిర్యాదు చేయడానికి శుక్రవారం వెళ్లారు. మీడియాపై వేసిన సెటైర్లకు ఆ టీవీ చానెల్ వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఓ చేత్తో ల్యాప్టాప్, మరోచేత్తో మీడియా ప్రసారాల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని పట్టుకుని వచ్చిన వర్మ, కమిషనర్ను కలిశారు. సదరు చానల్ అప్పల్రాజు సినిమాపై ప్రసారం చేసిన కథనాన్ని ల్యాప్టాప్లో ఆయనకు చూపించారు. ఆ చానల్ తనను వ్యక్తిగతంగా దూషించిందని తెలిపారు. ఆ చానల్ నిబంధనలు అతిక్రమించినట్టు చెప్పారు. అయితే, మౌఖిక ఫిర్యాదు వల్ల తాము చేసేదేమిలేదని కమిషనర్ ఖాన్ తేల్చిచెప్పడంతో మళ్లీ వచ్చి కలుస్తానంటూ వర్మ వెనుదిరిగారు. రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి ఆయన ముందుకు రాలేదు.
తనకు పిచ్చెక్కిందని, మైండ్ దొబ్బిందని దూషిస్తూ టీవీ 9 కథనం ప్రసారం చేసిందన్నారు. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. మళ్లీ వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఇదంతా ప్రచారం కోసం చేయడం లేదని వర్మ పేర్కొన్నారు.