చంద్రబాబు టార్గెట్ కెవిపి, మంత్రులు?
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో అక్రమాలకు బాధ్యులను చేస్తూ కెవిపి రామచందర్ రావుపై, కొంత మంది మంత్రులపై న్యాయస్థానానికి వెళ్లాలని తెలుగుదేశం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారుగా కెవిపి రామచందర్ రావు పాత్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. కెవిపి రామచందర్ రావుపై, మంత్రులపై తమ సీనియర్ పార్టీ నేత యనమల రామకృష్ణుడి చేత పిటిషన్ వేయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులపై పిటిషన్ వేసిన తర్వాత కెవిపి రామచందర్ రావు, కొంత మంది మిత్రులపై మరో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పిటిషన్లో వారిపై పొందుపరచాల్సిన ఆరోపణలను కూడా క్రోడీకరించినట్లు తెలుస్తోంది. భూముల కేటాయింపు, జలయజ్ఢం వంటి వాటిలో అవినీతి జరిగిందని తెలుగుదేశం విమర్శలు చేస్తూ వస్తోంది.