డ్రగ్స్ రాకెట్లో సినీ ప్రముఖులు
మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న సినీ ప్రముఖుల పేర్లు పోలీసులకు తెలిసినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల చర్యలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రధానంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తీరులోని మూడు బృందాలను ఏర్పాటు చేసి మురళిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. అదే తరహాలో మిగతా వారికి కూడా గాలం వేయాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. హీరో రవితేజ సోదరులు భరత్, రఘు పట్టుబడిన తర్వాత టాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ను ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మురళీ పట్టుబడినట్లు చెబుతున్నారు.
నైజీరియాకు చెందిన డేనియల్, పదవీ విరమణ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి చంద్రమోహన్ కుమారుడు భానుచందర్ అలియాస్ న్యాష లతో కలిసి మురళి టాలీవుడ్లో మాదకద్రవ్యాల విక్రయాన్ని సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు మురళితో పాటు డేనియల్, న్యాష్, మురళి అనుచరుడు పరిటాల రాంబాబులను శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు 15 లక్షల రూపాయల విలువ చేసే 305 గ్రాముల కొకైన్, కారు, సెల్ ఫోన్, డైరీలను స్వాధీనం చేసుకున్నారు. మురళీకి చెందిన డైరీ ద్వారా టాలీవుడ్ డొంకంతా కదులుతుందని అంటున్నారు.
కాగా, టాలీవుడ్ను మాదకద్రవ్యాల రాకెట్, వ్యభిచారం, మాఫియా కుదిపేస్తున్నాయి. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్తో టాలీవుడ్కు ఉన్న సంబంధాలు ఇటీవలే బయటపడ్డాయి. వర్ధమాన తారలు సైరాభాను, జ్యోతి అరెస్టు, ఈ మధ్య హీరోయిన్ యమున అరెస్టులతో సెక్స్ రాకెట్ గుట్టు బయటపడింది. రవితేజ సోదరుల అరెస్టుతో మాదక ద్రవ్యాల రాకెట్ మూలాలు తెలుస్తున్నాయి. సైరాభాను, జ్యోతిలతో సెక్స్ రాకెట్ నడిపినవారికి మాదక ద్రవ్యాలతో గల సంబంధాలపై కూడా పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. ఈ మూడు రాకెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని పోయాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.