పవన్ ఫిల్మ్ గొడవ: పూరీపై ఎన్ శంకర్ 'పవర్'
ఆ ప్రశ్నలను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాపై వివాదం చెలరేగడం ఎన్ శంకర్కు బాగా కలిసి వచ్చినట్లే ఉంది. పోకిరి, బిజినెస్మేన్ వంటి సినిమాలతో దూకుడు మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్పై ఆధిపత్యం సాధించడానికి శంకర్కు తాజా వివాదం బాగా పనికి వచ్చిందని అంటున్నారు. తెలంగాణ వ్యతిరేకతను పూరీ జగన్నాథ్ ఆ సినిమాలో కొట్టొచ్చినట్లు ప్రదర్శించారనే వివాదం నడుస్తుండగా, శంకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. ఆ రకంగా పూరీ జగన్నాథ్ను ఎదుర్కొని పైచేయి సాధించడానికి ప్రయత్నించారని అంటున్నారు.
తెలంగాణ వ్యతిరేకత మాత్రమే కాదు, మరిన్ని ప్రతికూల అంశాలు సినిమాలో ఉన్నాయంటూ శంకర్ అన్నారు. మహిళలకు, వికలాంగులకు వ్యతిరేకంగా కూడా సినిమా ఉందని ఆయన చెప్పారు. సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. సినిమా మొత్తాన్నే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆ రకంగా కొత్త వివాదాలను సృష్టించేందుకు కూడా శంకర్ వెనకాడలేదు. తెలంగాణలో కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా ప్రదర్శనను నిలిపేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ థియేటర్ల యజమానులకు పిలుపునివ్వడం, తెలంగాణవ్యాప్తంగా సినిమాపై తెలంగాణవాదులు ఆందోళనకు దిగడం శంకర్కు బాగా కలిసి వచ్చింది.
కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒక్కసారిగా మంట పుట్టింది. ఈ మంటలో పూరీ జగన్నాథ్ విలవిలలాడారని చెప్పలేం గానీ కొంత ప్రతికూలతను మాత్రం అనుభూతి చెందారని చెప్పవచ్చు. పైగా, నైజాం పంపిణీదారు దిల్ రాజు కూడా సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, సంభాషణలను తొలగిస్తామని చెప్పారు. ఈ స్థితిలో కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాకు పెద్ద దెబ్బనే తగిలిందని చెప్పాలి.
జై బోలో తెలంగాణ చిత్రం ద్వారా తెలంగాణవాదుల నుంచి ఎన్ శంకర్కు పూర్తి మద్దతు లభిస్తోంది. ఆ రకంగా సినీ పరిశ్రమలో ఆయన తనదంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిణామాన్ని సినీ పరిశ్రమలో తన పవర్ను చాటడానికి కూడా శంకర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు.