వైయస్ జగన్‌పై కేసు నిలువదా?

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నిలువదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం వార్తాకథనాలు వచ్చాయి. ధర్మాన వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన న్యాయనిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలను పరిశీలిస్తే జగన్‌పై కేసు కూడా నిలువదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ వార్తలు వచ్చాయి.

ఓ ప్రముఖ దినపత్రిక రాసిన వార్తాకథనం ప్రకారం - వాన్‌పిక్ కేసుకు సంబంధించి సిబిఐ చార్జిషీటులో ఐదవ నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును రక్షించేందుకు కొందరు మంత్రులు ముఖ్యమంత్రి మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పరిశీలనకు వారు న్యాయ నిపుణుల నివేదిక ఒకటి అందించారు. అయితే నివేదికను పరిశీలిస్తే మంత్రి ధర్మాన మీద ఉన్న కేసు సంగతి అలా పెడితే, అసలు జగన్‌మీద పెట్టిన అక్రమ ఆస్తుల కేసే నిలబడేందుకు అవకాశం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. నివేదిక మొత్తం జగన్ తరఫున వాదించినట్టుగానే కనిపిస్తోంది.

‘మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం, హక్కు ఎవరికీ లేదు. క్విడ్ ప్రో కో అన్నది మంత్రులకు అసలు వర్తించదు. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది' అన్నది ముఖ్యమంత్రికి మంత్రులు అందించిన నిపుణుల నివేదికలోని ప్రధానాంశాలు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న వాదనతో మంత్రులకు క్విడ్ ప్రో కో అన్నది వర్తించని పక్షంలో, జగన్ మీద అసలు కేసే ఉండదు. జగన్ మీద కేసు పెట్టింది ఈ రెండు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికనే. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 గురించి కూడా నివేదికలో ప్రస్తావించారు.

‘మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు, మంత్రి మండలి సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ నడుచుకోవాలి. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా గవవర్నర్ వ్యవహరించడానికి లేదు. మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వకూడదని మంత్రిమండలి నిర్ణయిస్తే దానికి విరుద్ధంగా మంత్రి ప్రాసిక్యూట్‌కు అనుమతి ఇచ్చే అధికారం గవర్నర్‌కు లేదు' అని అర్టికల్ 163 గురించి నివేదికలో ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం ఒక మంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని దర్యాప్తు సంస్థ భావించిన పక్షంలో, ఆ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియచేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తారు. దీనిపై మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గవర్నర్‌కు పంపిస్తారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు.

ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండగా, మంత్రులు, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిచ్చే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే ప్రస్తుతం మంత్రి ధర్మాన వ్యవహారానికి వస్తే, ధర్మానను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వకూడదని మంత్రిమండలి తీర్మానించిన తర్వాత దీనికి విరుద్ధంగా గవర్నర్ అనుమతి ఇచ్చినట్లయితే ఈ నివేదికలో పేర్కొన్న అర్టికల్ 163 వివరణకు అర్థం ఉంటుంది.

మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహారం, ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చే విషయం ఇప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల్లోనే ఉంది. గవర్నర్ వరకు వెళ్ళనే లేదు. అటువంటపుడు గవర్నర్ అధికారాల గురించి ఈ సందర్భంలో ప్రస్తావించడం అన్నది అసమంజసమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంత్రిమండలి అధికారాలకు సంబంధించి గతంలోని పలు కేసులను ఈ నివేదికలో పొందుపరచారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో 2004లో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించారు.

ఆ పత్రిక వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - ఇండోర్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఏడున్నర ఎకరాలను సేకరించింది. అయితే భూమిని సొంతదారులకే అప్పగించేలా నిర్ణయం తీసుకోవడంలో ఇద్దరు మంత్రులకు ప్రమేయం ఉందని లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. ఈ కేసును దర్యాప్తు జరిపిన అనంతరం ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు మంత్రులు నేర పూరిత కుట్రకు పాల్పడ్డారన్న దానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యప్రదేశ్ మంత్రి మండలిని లోకాయుక్త కోరింది. మంత్రిమండలిలో ఈ వ్యవహారంపై చర్చించి మంత్రులు ఇద్దరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడానికి ఏ చిన్న ఆధారం లేదని, వారి మీద ఎటువంటి ప్రాధమిక సాక్ష్యాధారాలు లేవంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వరాదని మంత్రిమండలి తీర్మానించింది. అయితే మంత్రులిద్దరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడానికి తగిన సాక్ష్యాధారాలు, పత్రాలు ఉన్నాయంటూ వారిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు.

చివరకు ఈ కేసు న్యాయస్థానానికి ఎక్కి సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్‌కి తర్వాత ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వరకూ వెళ్ళింది. మంత్రిమండలి నిర్ణయం, సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించాలి, గవర్నర్‌కు కొన్ని ఆంశాల్లో మాత్రమే విచక్షణాధికారాలను రాజ్యాంగం కల్పించింది. అందులో మంత్రులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించే అశం లేదు. మంత్రిమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రులను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడం చెల్లదన్న అంశాలు ఈ కేసు సందర్భంగా వెల్లడైనట్టు ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.

ఇక క్విడ్ ప్రోకో అంశం గురించి ప్రస్తావిస్తూ, క్విడ్ ప్రోకో కేవలం ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని, ప్రమోషన్లు, వేతనాల పెంపు, షిఫ్టుల ప్రకారం పనులు అప్పగించడం, పనితీరు ప్రమాణాలు, అదేవిధంగా విద్యాపరమైన అంశాల్లో మాత్రమే క్విడ్ ప్రోకో వేధింపులు అన్నవి తలెత్తుతాయని వివరించారు. అసలు క్విడ్ ప్రోకో అన్నది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 20 ప్రకారం న్యాయస్ధానాల్లో కూడా చెల్లుబాటు కాదని అన్నారు. అయితే క్విడ్ ప్రోకో వల్ల లాభ పడిన వ్యక్తి ఎవరన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+