జ్యోతిశ్యుల మాట వినని చంద్రబాబు
తన పాదయాత్రకు వస్తున్నా మీ కోసం అని కూడా పేరు పెట్టారు. అయితే, అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు మంచి రోజులు లేవని, ఈ రోజుల్లో పాదయాత్రను ప్రారంభించవద్దని జ్యోతిశ్యులు చంద్రబాబుకు సూచించారట. పితృ పక్షాలు కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజులు కావని వారు చెప్పారని అంటున్నారు. అయితే, తన పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చుకోవడానికి చంద్రబాబు ఇష్టపడలేదని అంటున్నారు.
నవరాత్రులు ప్రారంభమయ్యే 16వ తేదీన గానీ, విజయదశమి రోజు అక్టోబర్ 25వ తేదీన గానీ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జాతక పండితులు చెప్పారని అంటున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగానే తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన ముగిస్తానని ఆయన మొండికేశారని అంటున్నారు.
పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై మాత్రం వాస్తు పండితుల మాటకు ఆయన విలువ ఇచ్చినట్లు చెబుతున్నారు. వాస్తు ప్రకారం అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించాలని వారు చెప్పారని, అందుకు చంద్రబాబు అంగీకరించారని అంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుంచి ప్రారంభిస్తే అది వ్యతిరేక దిశ అవుతుందని, అది సరైన ప్రాంతం కాదని వాస్తు పండితులు చెప్పారని అంటున్నారు. హిందూపురం నుంచి ప్రారంభించి ఉత్తర దిశగా సాగితే మంచిదని వాస్తు పండితులు చెప్పారని అంటున్నారు. అయితే, వాస్తు పండితుల మాటలకు కూడా చంద్రబాబు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదని, హిందూపురం నియోజకవర్గాన్ని ఎన్టీ రామారావు పోటీ చేయడానికి ఎంచుకున్నారని, దానికి గుర్తుగా అక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చంద్రబాబు అనుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తును శుభదినం చూసి చంద్రబాబు కుదుర్చుకున్నారని, అది కూడా తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యక్తిగత జ్యోతిశ్యుడు ముహూర్తం పెట్టారని, మంచి రోజు చూసి మహా కూటమి ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదని, అందువల్ల జ్యోతిశ్యుల మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.