జగన్తోపాటు మనమూ: కష్టమంటున్న మంత్రులు
మోపిదేవి అరెస్టు, ధర్మాన రాజీనామా నేపథ్యంలో తన దాకా వస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన మంత్రులకు పట్టుకుంది. దీంతో తమను తాము కాపాడుకునే ఉద్దేశ్యంలో భాగంగా కేసులో ఇరుక్కున్న తోటి మంత్రులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా ధర్మాన రాజీనామా, కేసుల తీరుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు మంత్రులు ఆయనతో భేటీ అయ్యారు. తమ ఆవేదనను వారు కిరణ్ దృష్టికి తీసుకు వెళ్లారు.
ముఖ్యమంత్రితో జరిగే ఈ భేటీలో వారు ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని, జగన్ కేసులో సిబిఐ దర్యాఫ్తు క్రమంగా తమ వైపుకు మళ్లుతుందని, నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయాలకు తాము ఎలా బాధ్యులమవుతామని, ఆయన చెప్పినట్లుగా మేం చేశామని వారు కిరణ్ ముందు మొర పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రికి వారు సూచించినట్లుగా సమాచారం.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని పలు నిర్ణయాల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారని, తమకు చేకూరిందేమీ లేదని, ఆయన లబ్ధి పొందడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, మంత్రులుగా తమ బాధ్యతలు మాత్రమే తాము నిర్వర్తించామని, తెర వెనుక జరిగే లాలూచీలకు తమకేం సంబంధమని వారు అన్నారని తెలుస్తోంది.
మంత్రులను టార్గెట్ చేసుకొని సిబిఐ దర్యాఫ్తు సాగితే పార్టీకే నష్టమని, మరో సంవత్సరంన్నరలో సాధారణ ఎన్నికలు ఉన్న దృష్ట్యా మంత్రులు జగన్ కేసులలో ఇరుక్కుపోతే అప్పుడు ఆయన పార్టీతో పాటు కాంగ్రెసు కూడా ప్రజల ముందు దోషిగా నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు చెప్పారని తెలుస్తోంది.
అలా కాకుండా ఉండాలంటే వైయస్ హయాంలో జగన్కు జరిగిన మేళ్లకు ఇప్పటి నుండే మంత్రుల పాత్రను పరిమితం చేస్తూ వెళ్లడమే మంచిదని వారు సూచించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో ధర్మాన ప్రసాద రావు, దానం నాగేందర్, బస్వరాజు సారయ్య, పితాని సత్యనారాయణ, గల్లా అరుణ కుమారి, మహీధర్ రెడ్డి, పితాని సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి ధర్మాన వీరందరికీ ఫోన్ చేసి ఆహ్వానించారు.