ఈడి దూకుడు: తీహార్ జైలుకు జగన్!?
ఐటి కమిషనర్ సోమవారం సిబిఐ జెడి లక్ష్మీ నారాయణతో భేటీ అయ్యారు. జగన్ కేసులో ఛార్జీషీట్లకి సంబంధించిన పలు విషయాలను ఆయన తెలుసుకున్నారు. జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా ఐటి శాఖ గుర్తించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఐటి పత్రాల్లో ప్రభుత్వానికి చూపిన లెక్కకు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్లోని ఆస్తుల చిట్టాకు పొంతన లేదని ఐటి గుర్తించిందట.
ఈడి కూడా ఇటీవల ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో ఇటీవల దూకుడును కూడా పెంచింది. దీంతో ఈడి జగన్ను త్వరలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక సిబిఐకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జగన్ కేసు విచారణకు డెడ్ లైన్ విధించింది. దీంతో సిబిఐ కూడా ఆస్తుల కేసులో వేగాన్ని పెంచింది. ఈ కేసులో ఒక్క ఛార్జీషీట్ మాత్రమే వేయాలని, 2013 మార్చిలోగా ముగించాలని సుప్రీం సూచించింది.
దీంతో ఈ కేసు దర్యాఫ్తును సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు సిబిఐ చకచకా పావులు కదుపుతోంది. ఇందుకోసం త్వరలో మరో ఆటాచ్మెంట్ కోసం కూడా ఇటు ఈడి, అటు సిబిఐ సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. దసరా తర్వాత ఈ దర్యాఫ్తులో మరింత వేగం పెంచనున్నారట. విచారణ కోసం జగన్ను చంచల్గూడ జైలు నుండి తీహార్ జైలుకు కూడా తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.