ఆత్మరక్షణలో జగన్పార్టీ: బ్లాక్మెయిల్ కోసమేనా?
బాబుకు వస్తున్న ఆదరణ ఎక్కడ కొంపముంచుతుందో అనే ఆందోళనతోనే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన సోదరి షర్మిల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ధర్నా, ఓదార్పు, యాత్ర ఏదో ఒక పేరుతో ప్రజల్లో ఉండటమే ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. ఇటీవల పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా హితబోధ చేశారు. బాబు యాత్రకు వస్తున్న స్పందన చూసిన ఆ పార్టీలో ఆందోళన కలిగి షర్మిల యాత్ర కోసం జగన్ అనుమతి తీసుకున్నారని అంటున్నారు.
ఏదో ఒక పేరుతో ప్రజల్లో ఉండటమే మంచిదని భావించే జగన్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఊపారట. ప్రత్యేకంగా పార్టీ నేతలు బాబు యాత్రతో ముచ్చమటలు పోయడంతో షర్మిలచే ఆయన కంటే ఎక్కువ కిలోమీటర్ల పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. షర్మిల యాత్రతో బాబు యాత్రను మరిపించడమే కాకుండా తమ పార్టీ పైన ప్రజల్లో ఉన్న సానుభూతిని అలాగే ఉంచడానికి ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారట.
అవిశ్వాసం విషయంలోనూ ఆత్మరక్షణే
ఇటీవల అవిశ్వాసం అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ మరోసారి తెర పైకి తీసుకు వచ్చింది. అవిశ్వాసం పెట్టాలని జగన్ పార్టీ డిమాండ్ చేయడంతో టిడిపి కూడా అంతే ఘాటుగా స్పందించింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అవిశ్వాసంపై ధీటుగా స్పందించారు. దీంతో జగన్ పార్టీ ఆత్మరక్షణలో పడిందంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో టిడిపి కుమ్మక్కైందని, అది కాదని నిరూపించే దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని జగన్ పార్టీ డిమాండ్ చేసింది.
దీనికి ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి తదితరులు స్పందించారు. జగన్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెసు ఆధ్వర్యంలోని యూపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిందని, అలాంటప్పుడు కుమ్మక్కయింది ఎవరో వేరే చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. గతంలో తాము అవిశ్వాసం పెట్టామని, ఇప్పుడు జగన్ పార్టీ అవిశ్వాసం పెడితే తాము మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు వారు సిద్ధమా అని సవాల్ విసిరారు.
జగన్కు ఇటీవల సుప్రీం కోర్టులోనూ బెయిల్ రాలేదని, ఆ తర్వాత విజయమ్మ రాష్ట్రపతిని కలిశారని, ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు తాము అవిశ్వాసం పెడితే జగన్ పార్టీ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి కేసులు కొట్టేయించుకొని, జగన్ను జైలు నుండి బయటకు రప్పించుకోవడం ఖాయమని విమర్శించారు. వారు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే అవిశ్వాసం కోరుతున్నారన్నారు.
టిడిపి పాలనను విమర్శించిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ చంద్రబాబు పాలనపై అవిశ్వాసం పెట్టలేదని, ఆయన విమర్శలు అబద్దమా లేక సంక్షేమం పట్ల ఆయనకు శ్రద్ధ లేకనా అని ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పైన కూడా జగన్ పార్టీ విమర్శలు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. ప్రణబ్కు ఓటేయడం, వాద్రాను విమర్శించక పోవడం, రాష్ట్రపతిని కలవడం ఇవన్నీ కుమ్మక్కయ్యారనేందుకు మంచి నిదర్శనం అంటున్నారు. మేం అవిశ్వాసం పెడితే జగన్ పార్టీ బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.