షర్మిల పాదయాత్రలో జంప్ జిలానీలు
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు కౌంటర్గా ప్రారంభమవుతున్న షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో వలసలు తిరిగి పుంజుకుంటాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. షర్మిల యాత్ర చేపట్టబోయే ప్రతి జిల్లాలో ఆ జిల్లాకు చెందిన ఇతర పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఆమె సమక్షంలోనే తమ పార్టీ తీర్థం పుచ్చుకునేలా జగన్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట.
షర్మిల కేవలం పాదయాత్ర చేస్తే సరిపోదని, ఇతర పార్టీల నుండి ముఖ్య నేతలు వస్తేనే దానికి అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తున్నారట. ఇందుకోసం ఆయా జిల్లా నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు జగన్ గూటికి చేరుకుంటారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్, అమర్నాథ్ రెడ్డిలు జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో ఇద్దరు కూడా క్యూలో ఉన్నారట.
నవంబర్ 11వ తేదిన నల్గొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత సంకినేని వెంకటేశ్వర రావు షర్మిల సమక్షంలో కాకపోయినా విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు తనయుడు జలగం వెంకట్రావు కూడా 19న వైయస్సార్ కాంగ్రెసు తీర్థం పుచ్చుకోనున్నారు. షర్మిల పాదయాత్ర ఈ నెల 18న ఇడుపులపాయ నుండి ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత వరుసగా ఆమె జిల్లాలను చుడతారు. ఈ సమయంలో పలువురు నేతలు ఆమె సమక్షంలో జగన్కు జై కొడతారని తెలుస్తోంది. సాదాసీదా కంటే షర్మిల సమక్షంలో జాయిన్ అయ్యేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారట. అలా అయితే స్థానికంగా తమ పలుకుబడి కూడా పెరుగుతుందని భావిస్తున్నారట. గతంలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో ఇలాగే పలువురు జగన్ పంచన చేరారు.