కెసిఆర్ ఎక్కడ: తెలంగాణ మార్చ్కు మిస్
ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ హైదరాబాదు ముఖం చూడలేదు. తెలంగాణ కలను సాకారం చేసుకోవడానికి మాత్రమే కెసిఆర్ ఢిల్లీలో మకాం వేశారని అంటున్నారు. అయితే, కెసిఆర్ మాటలను తెలంగాణవాదులు ఏ మాత్రం విశ్వసించడం లేదు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం కలగడం లేదు. అయితే, ఢిల్లీ నుంచే కెసిఆర్ మార్చ్కు ముందు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ కవాతులో పాల్గొనాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్ను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. నిజానికి, ఆదివారంనాడు కెసిఆర్కు ఢిల్లీలో పెద్ద పనేమీ లేదని తెలుస్తోంది. అంతకు ముందు రోజు ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను కలిశారు.
ఆదివారమంతా కెసిఆర్ తెలంగాణ మార్చ్ను మానిటర్ చేస్తూ గడిపారని అంటున్నారు. తెలంగాణ మార్చ్కు తెరాస అందించిన కృషి తక్కువేమీ కాదు. తెరాస శాసనసభ్యులు, నాయకులు పూర్తిగా తెలంగాణ మర్చ్కు సహకరించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, తెలంగాణ అంశాన్ని ప్రస్తుతానికి కాంగ్రెసు అధిష్టానం పక్కన పెట్టినట్లే తెలుస్తోంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాతనే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అది కూడా యుపిఎలో తలెత్తిన విభేదాల వల్ల వెనక్కి పోయింది. అక్టోబర్ 15వ తేదీ తర్వాతనే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి పెడుతుందని అంటున్నారు. అయినా సరే, కెసిఆర్ హైదరాబాదుకు వచ్చే ఉద్దేశం లేదని అంటున్నారు. కాంగ్రెసుతో అటో ఇటో తేల్చుకున్న తర్వాతనే ఆయన తిరిగి వస్తారని అంటున్నారు. కెసిఆర్ లేకుండా తెలంగాణకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం జరగడం ఇదే మొదటి సారి. అది తెలంగాణ మార్చ్.