ఇప్పుడు దూరమే, 2019 నారా లోకేష్ టార్గెట్
రానున్న ఎన్నికలు పార్టీకి తిరిగి జీవం పోయడమేనని, పార్టీని గెలిపించేందుకు సర్వశక్తులు కేంద్రీకరించ వలసి ఉన్నందున లోకేష్ పోటీ చేయడం సాధ్యపడదని అంటున్నారు. చంద్రబాబు సహా అగ్రనేతలంతా ఎన్నికల్లో మునిగిపోతే తెరవెనుక, ముందు చేయవలసిన కసరత్తు, యంత్రాంగ పర్యవేక్షణ, సర్వేలు ఇవన్నీ ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న ప్రచారం మాత్రమేనని లోకేష్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ కూడా ఎన్నికల బరిలో దిగితే ఇక 2014 ఎన్నికల్లో సమన్వయం చేసే సామర్ధ్యం ఉన్న వారెవరూ ఉండరని, అప్పుడు తమ విజయం సులభం అవుతుందున్న ముందుచూపుతోనే, ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని విశ్లేషిస్తున్నారు. దీని వెనుక పక్కా ప్రణాళిక ఉందని, లోకేష్ను క్రియాశీలకంగా వ్యవహరించకుండా దూరంగా ఉంచే ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు. ఇప్పుడు తాను పోటీ చేయనని, ఇప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలిపిద్దామని, 2019 ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని లోకేష్ పార్టీ సీనియర్లకు చెబుతున్నారట.
లోకేష్ చాలాకాలం నుంచి తెరవెనుక ఉండి పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత పోషిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న లోకేష్ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ, సంయమనం పాటించాలని అభ్యర్ధిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రానున్న ఈ సమయంలో వివిధ అంశాలపై సంయమనం పాటించి, సమస్యను మరింత తీవ్రతరం చేయవద్దని నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు అవసరమైన వ్యాఖ్యలను కూడా ఆయన అందిస్తున్నారు.