అఖిలేష్ ఆదర్శం: నారా లోకేష్ సైకిల్ యాత్ర

చంద్రబాబు పాదయాత్ర పూర్తయిన తర్వాత లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన తెర వెనక కీలకమైన పాత్రనే పోషించారు. పార్టీకి సంబంధించిన పలు విషయాల్లో వ్యూహాత్మక సలహాలు ఇచ్చినట్లు చెబుతారు. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నగదు బదిలీ పథకం ఆలోచన నారా లోకేష్దేనని చెబుతారు. ఇప్పుడు ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
వైయస్ జగన్ అవినీతిపై మాట్లాడే విషయంలో పదే పదే లక్ష కోట్లు అని చెప్పకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొత్తగా చెప్పాలంటూ ఆయన సూచించారు. వెయ్యి లారీల నిండా వంద నోట్ల బస్తాలు నింపితే ఎంత అవుతుందో అంత జగన్ దోపిడీ చేశారంటూ చెప్పాలని ఆయన సలహా ఇచ్చారు. దాన్నే చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తున్నారు. అంతేకాకుండా, ట్విట్టర్లో ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. వైయస్ జగన్కు బెయిల్ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారే గానీ నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పడం లేదని ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
ఇటీవలి శాసనసభా పక్ష సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకుని, ఎప్పటికప్పుడు వివిధ విషయాలపై వారితో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని భావిస్తున్నట్లు, దీనిపై అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దానికితోడు, లోకేష్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications