కొత్త చిచ్చు: షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి
ఆ విషయం తెలిసిన షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అవినాష్ పాదయాత్ర చేస్తే తాను చేస్తున్న పాదయాత్ర నిలిపివేస్తానని ఆమె చెప్పారని అంటున్నారు. దానితో అవినాష్ పాదయాత్రను రద్దు చేసుకున్నారు. తాజా పరిణామాలు వైయస్ కుటుంబంలో కొత్త చిచ్చుకు బీజం వేశాయి. వైయస్ జగన్ పులివెందుల సీటు నుంచి శాసనసభకు పోటీ చేస్తారు కాబట్టి కడప పార్లమెంటు సీటు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల గట్టిగా చెబుతున్నారని సమాచారం.
తాను పులివెందుల సీటు నుంచి పోటీ చేసి, కడప పార్లమెంటు సీటు నుంచి అవినాష్రెడ్డిని బరిలో దించాలని జగన్ భావించారని అంటారు. అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు చెప్పారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే కడప నుంచి పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారని సమాచారం.
అయితే, చాలాకాలంగా కడప లోక్సభ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డి పేరు ప్రచారంలో ప్రచారంలో ఉంది. దాంతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని ఆయన భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇన్చార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి ఉదయం తొమ్మిదిన్నరకు పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.
ఆ సమాచారాన్ని జిల్లా కన్వీనర్ అంజాద్బాషా పార్టీ నేతలకు పంపించారు. అయితే, అవినాష్ పాదయాత్ర వాయిదా పడిందని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మరో సందేశం పంపించారు. షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగానే అది ఆగిపోయిందని అంటున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అవినాష్ రెడ్డి గతంలో జైలులో ఉన్న జగన్ను కోరారని తెలుస్తోంది. అయితే రెండు నెలలు ఆగమని జగన్ అప్పుడు చెప్పడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది.
మళ్లీ 15 రోజుల క్రితం కలిసినప్పుడు పాదయాత్ర చేయమని జగన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దానితో అవినాష్ ఉత్సాహంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 23వ తేదీని పాదయాత్ర ఖరారు చేశారు.పాదయాత్రను రద్దు చేసుకోవాలని అవినాష్ రెడ్డికి బుధవారం హైదరాబాదు నుంచి ఫోన్ వెళ్లిందని సమాచారం.