చిక్కుముడే: 2014 తర్వాతే తెలంగాణ!

గణేష్ నిమజ్జనం, జీవవైవిధ్య సదస్సు నేపథ్యంలో తెలంగాణ మార్చ్ను వాయిదా వేయించాలనే ఆలోచనతోనో లేక తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి దానిని విజయవంతం కాకుండా చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగానో ఈ నెలాఖరులోగా తెలంగాణపై నిర్ణయం ఉంటుందనే ప్రచారానికి తెరలేచిందని అంటున్నారు. అంతేకాని సున్నితమైన అంశాన్ని, అదీ యూపిఏ ప్రభుత్వం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో తెలంగాణకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో నిర్ణయం తీసుకునే సాహసం కాంగ్రెసు గానీ, యూపిఏ కానీ చేయదంటున్నారు.
ఈ నెలాఖరులోగా తెలంగాణపై కీలక ప్రకటన వెలువడుతుందని పలువురు నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అదే నిజమైతే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తే సీమాంధ్ర ఎంపీలు, వ్యతిరేకంగా వస్తే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు చాలామంది రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకోదని చెబుతున్నారు. అంతగా అవసరమైతే తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామని, త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.
అఖిలపక్ష సమావేశంపై కేంద్రం ఓ పద్ధతి ప్రకారం ప్రకటన చేసి తెలంగాణ మార్చ్ను వాయిదా వేయించే ప్రయత్నాలు చేయవచ్చునని చెబుతున్నారు. గతంలో అఖిలపక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుండి ఇద్దరు నేతలు(ఇరు ప్రాంతాల నుండి ఒక్కొక్కరు) వెళ్లారు. కానీ ఈసారి కేంద్రం స్పష్టంగా.. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కొక్కరిని మాత్రమే పిలిచి తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని తెలుసుకుంటామని, ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశముందని అంటున్నారు.
ఒక్కో పార్టీ నుండి ఇద్దరు కాకుండా ఒకరిని అఖిలపక్షానికి పిలవాలని తెలంగాణవాదులు మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా కొంత సద్దుమణిగే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ వంటి పార్టీలు ఒక పార్టీ నుండి ఒకరికి మించి పిలిస్తే తాము అఖిలపక్షానికి హాజరు కాబోమని చెప్పారు కూడా. ప్రస్తుతం కేంద్రం తెలంగాణ మార్చ్ను అధిగమించాలని చూస్తోందని అంటున్నారు.
ఆ తర్వాత ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తీసుకొని, సీమాంధ్ర నేతలను తెలంగాణకు ఒప్పించే ప్రయత్నాలు చేయవచ్చునని చెబుతున్నారు. 2014లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించి ఎన్నికల తర్వాత ప్రత్యేక రాష్ట్రం దిశలో చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. కానీ అందరూ భావిస్తున్నట్లుగా ఇప్పటికిప్పుడు మాత్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతగా అవసరమైతే ప్యాకేజీ లేదా దాంతో పాటు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకునే చర్యలు చేపడతామని ప్రకటించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications