తెలంగాణ టెన్షన్: సెప్టెంబర్ 25వ తేదీ కీలకం?
కాంగ్రెసు అధిష్టానం పెద్దలు తెలంగాణపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లే వార్తలు వస్తున్నాయి. 2009 డిసెంబర్ 9, 23 తేదీల్లో చేసిన ప్రకటనల నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చితికి తెర దించే మార్గాలను అన్వేషించే పనిలో పడింది. రెండు రోజులుగా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో, పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కీలక చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఇద్దరేసి నేతలతో అధిష్ఠానం ఈ సంప్రదింపులను చేపట్టింది. ఇటీవల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కీలక నేతను అధిష్ఠానవర్గానికి చెందిన కీలక నేతలు పిలిపించుకుని మాట్లాడారు. ఈ పర్యటన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఆ నేతకు స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
'తెలంగాణపై ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?' అనే ప్రశ్నతో ఈ చర్చ మొదలైంది. రాష్ట్ర విభజన అవసరమా? సమైక్యంగా ఉంచితే కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా? విభజిస్తే రెండుగా విభజించాలా? లేక మూడు రాష్ట్రాలు చేయాలా? హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే పరిణామాలు ఏలా ఉంటాయి? లేదంటే హైదరాబాద్ను ఉమ్మడి రాష్ట్రంగా ప్రకటించాలా? హైదరాబాద్లేని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? సీమాంధ్రలో తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందా? వారెందుకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటారు? రాష్ట్రం సమైక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయి? విభజన జరిగితే ప్రాంతాల వారీగా వచ్చే లోక్సభ స్థానాల మాటేమిటి? అంటూ ఆ నేతపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. గతంలో అఖిలపక్ష సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి హోం మంత్రి చిదంబరం ఎదుట హాజరైన ఆ కీలక నేత ఈ ప్రశ్నలన్నింటికీ సావధానంగా సమాధానాలు చెప్పారని కూడా రాసింది.
అదిలా వుంటే, తెరాస ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకున్న భేటీ రద్దు కావటం చర్చనీయాంశమైంది. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ రాత్రి 7.30 గంటలకు ఇక్కడ ఒక హోటల్లో సమావేశం కావాలనుకున్నారు. ఈమేరకు పార్టీ శాసనసభా పక్ష కార్యాలయం నుంచి వారికి సమాచారం వెళ్లింది. అయితే, రాత్రి వేళ భేటీని రద్దు చేసుకుంటూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని, తిరిగి సమాచారాన్ని ఎమ్మెల్యేలకు చేరవేశారు. అయితే, ఓ రహస్య ప్రదేశంలో ఆ సమావేశం జరిగినట్లు కూడా ప్రచారం సాగుతోంది.