టెక్కీలతో గొడవ: రామ్ చరణ్ తేజ అబద్ధాలు?
హైదరాబాద్: టెక్కీలతో జరిగిన గొడవలో కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ తేజ అబద్ధాలు ఆడారా.. అవునని పోలీసులు మానవ హక్కుల కమిషన్కు సమర్పించిన నివేదికలో అంటున్నారు. ఇద్దరు టెక్కీలను రామ్ చరణ్ తేజ బాడీగార్డులు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చితకబాదినట్లు ఆరోపణలు వచ్చి నెలన్నర గడుస్తోంది. ఆ ఇద్దరు యువకులను తొలుత రామ్ చరణ్ తేజ బనాయించాడని, ఆ తర్వాత చిరంజీవి వ్యక్తిగత రక్షక భటులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం ముదిరిందని అంటున్నారు.
రద్దీగా ఉండే పగటి పూట కారు నడపవద్దని, రాత్రి పూట నడపాలంటూ రామ్ చరణ్ తేజ ఆ యువకులను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నాడని పోలీసులు మానవ హక్కుల కమిషన్కు సమర్పించిన నివేదికలో చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. ఆ మాటలతో రామ్ చరణ్ తేజ రెచ్చగొట్టడంతో వాగ్వివాదం ప్రారంభమైందని, గార్డులు వారిద్దరని కొట్టారని బంజారాహిల్స్ ఎసిపి శంకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్కు సమర్పించిన నివేదికలో వివరించినట్లు వార్తలు వచ్చాయి.

మీడియా వార్తల ప్రకారం - ఉప్పల్కు చెందిన కళ్యాణ్, కొండాపూర్కు చెందిన ఫణీష్లకు చెందిన మారుతి ఆల్టో కారు అడ్డం రావడంతో రామ్ చరణ్ తేజ ఆస్టోన్ మార్టిన్ వి8 వెంటేజ్ కారు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఆల్టో కారులో టెక్కీలిదద్రు పంజగుట్ట నుంచి కొండాపూర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
హారన్ కొట్టినప్పటికీ దారి ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ తేజ టెక్కీలపై ఆగ్రహించాడు. ఆ తర్వాత దాన్ని దాటేసి ఆల్టోకు అడ్డంగా తన కారు పెట్టాడు. రామ్ చరణ్ తేజ సెక్యూరటీ గార్డులు టెక్కీలతో వివాదానికి దిగారు. ఇరు పక్షాలు కొట్టుకున్నాయి కూడా. సమీపంలోనే ఉన్న చిరంజీవి సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడికి చేరుకున్నారు. గొడవకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేశారని చెప్పిన రామ్ చరణ్ తేజ మాటలను కూడా పోలీసులు తప్పు పట్టినట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ కారు నుంచి దిగి గొడవను చూస్తూ నిలుచున్నాడని కూడా పోలీసుల నివేదిక తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
గొడవపై ఎస్ఎ సలీం అనే హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు మేరకు మానవ హక్కుల కమిషన్ ఆదేశంతో పోలీసులు నివేదిక సమర్పించారు. రామ్ చరణ్ తేజపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఫిర్యాదు చేస్తూ మే 8వ తేదీన సలీం మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
పిటిషన్లో ఎసిపిని కూడా నిందితుడిగా చేర్చినందున తాజా నివేదికను ఆగస్టు 28వ తేదీలోగా సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ను ఆదేశించింది. ఇరు వర్గాలు గొడవకు దిగారని చెబుతూ పోలీసులు తన నివేదికలో జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది. ఫిర్యాదు లేనందున విషయాన్ని తాము పట్టించుకోలేదని పోలీసులు చెప్పారు. అయితే, సలీం పోలీసుల తీరును తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications