దిల్షుక్నగర్ పేలుళ్లు: సూత్రధారి కన్యాకుమారిలో?
తమ వద్ద ప్రస్తుతం ఉన్న ఆధారాలతో పేలుళ్ల పాత్రదారులను గుర్తించి, పట్టుకోవడానికి దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పేలుళ్లకు ముందు హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతం నుంచి ఇండియన్ ముజాహిదీన్ అధినేత యాసిన్ భత్కల్కు ఫోన్ కాల్ వెళ్లినట్లు కూడా మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి అతని సెల్ఫోన్కు వెళ్లిన ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్పై ఆరా తీస్తున్నారు.
విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఆదివారం ఒక్కరోజే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తితో ఉత్తరప్రదేశ్కు చెందిన వకాబ్, అహ్మద్, షాకిర్లకు సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వారి కోసం అన్వేషిస్తున్నారు. అలాగే, హైదరాబాద్కు చెందిన ఓ ఉర్దూ టీచర్ కుమారుడిని బీహార్లోని బెగూసరాయ్లో ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాయి. ఇతనికి హైదరాబాద్లో పలువురితో పరిచయాలున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఉగ్రవాదులు శిక్షలు అనుభవిస్తున్న జైళ్లలో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. తమకు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే, బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్న ఉగ్రవాదులను ఆదివారం విచారించారు. ఉగ్రవాది ఉబేదుర్ రెహమాన్ను గంటకుపైగా విచారించారు. అరెస్టు కావడానికి ముందు కొద్ది రోజులు అతడు హైదరాబాద్లో గడపాడని సమాచారం.
బెంగళూరులో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో చార్జిషీటు దాఖలైన 12 మంది లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో కనీసం ఇద్దరికి హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీరిపై ఇటీవలే చార్జిషీటు దాఖలైన సంగతి తెలిసిందే. అలాగే, నేపాల్ సరిహద్దుల్లో శనివారం సాయంత్రం పట్టుబడిన ఇద్దరు అనుమానితులను విచారించడానికి ఎన్ఐఏ అధికారులు ఆదివారం బీహార్లోని రెక్సల్ గ్రామానికి చేరుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో వారికి సంబంధం ఉందా లేదా అన్న విషయమై ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా, వారి నుంచి కొన్ని ఆధారాలు లభించవచ్చని ఎన్ఐఏ భావిస్తోంది.
పేలుళ్లకు కారణమైన వ్యక్తి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉండవచ్చని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద అనుమానితుల సెల్ ఫోన్లకు కన్యాకుమారి నుంచి పలు ఫోన్ కాల్స్ వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో, ఎన్ఐఏ అధికారులతో కలిసి స్థానిక పోలీసులు ఆదివారం కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు. "కేరళకు పారిపోయే క్రమంలో హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉన్న వ్యక్తి కన్యాకుమారిలో దాక్కున్నట్లు మాకు సమాచారం అందింది. అందుకే, సరిహద్దులు, తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాం. అనుమానితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని మత్య్సకారులకూ సూచించాం'' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కొన్ని ఆధారాలు దొరికాయి: షిండే
పేలుళ్ల దోషులను అతి త్వరలోనే పట్టుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ఆదివారం కోల్కతాలో వ్యాఖ్యానించారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు లభించాయని, ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలనలు జరుపుతున్నామని, వాటి వివరాలు తెలిసిన వెంటనే దోషులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.