కిరణ్ సంచలనం: జగన్లా కొత్త పార్టీయా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. లోకవిరుద్ధంగా వెళ్తే ప్రజలు ఇంటికి పంపిస్తారని, సరైన సమనయం వచ్చినప్పుడు ముందుకు వస్తామని కిరణ్ చెప్పడంతో రకరకాల ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. కిరణ్ వ్యాఖ్యలతో ఆయన ఎందుకు అలా మాట్లాడారు, ఏం చేస్తారనే ప్రశ్న అందరిలోను ఉత్పన్నమవుతోంది.
హైదరాబాద్ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చాకే విభజనపై అడుగు ముందుకు వేయండని కొన్నాళ్ల క్రితం గర్జించిన ఆయన తేడా వస్తే ఇంటికి పంపేస్తారని హెచ్చరికలు పంపించడమే దీనికి కారణం. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన 'తెలుగు భాషా దినోత్సవం'లో సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన కిరణ్ చివరి మూడు నిమిషాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, సొంత పార్టీ పెడతారని రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

విభజనపై నిర్ణయం తీసుకున్నామని అధిష్టానంకు హెచ్చరికగానే కిరణ్ సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తీసుకోకుంటే ప్రజలు సెలవు ప్రకటిస్తారని అన్నారని అంటున్నారు.సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ముందుకు వస్తామని, తెలుగు ప్రజల పురోగతికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటామని, ఎంత కష్టమైన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని వేడుకుంటున్నామని ఆయన అన్నారు.
నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కావని... ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారని కిరణ్ పేర్కొనడం విశేషం. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలోనే కిరణ్ ప్రజా నిర్ణయం గురించి ప్రస్తావించడం, సెలవు ప్రకటిస్తారని స్పష్టం చేయడమంటే... విభజన జరిగితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో హైకమాండ్కు అర్థమయ్యేలా చెప్పడమేనని పేర్కొంటున్నారు.
వేరు కుంపటిపై చర్చ
కిరణ్ తన ప్రసంగంలో ఎక్కువగా ప్రజల గురించే మాట్లాడారు. పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యమనేలా మాట్లాడారు. పార్టీతో, ప్రభుత్వంతో తనకు దూరం పెరిగిందనేలా మాట్లాడారు. ప్రజల్లోకి వెళతా అన్న భావాన్ని కిరణ్ వ్యక్తం చేయడంతో భవిష్యత్లో ఏమి జరగబోతుందన్న రాజకీయ చర్చకు తెర లేచింది. కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలా కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారా అని ఇటీవల టిడిపి ప్రశ్నించింది.
కొద్ది రోజుల కిందట శాసనసభ్యుడు రౌతు సూర్య ప్రకాశ రావు త్వరలోనే కొత్త పార్టీ రానుందని, నాయకుడెవరో త్వరలో చెబుతామని సీఎల్పీ వేదికగానే ప్రకటించారు. ఆ తర్వాత తన ప్రకటనను వెనక్కి తీసుకున్నప్పటికీ చర్చ జరిగింది. అప్పటి నుంచి సిఎం వేరు కుంపటి పెడతారా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయత ప్రకటించే కిరణ్ అంత సాహసం చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications