జగన్ సేఫ్: చిరు, బాలయ్య ఆంధ్రలో పోటీ చేయలేరా?
రాజ్యాంగ నిబంధనల మేరకు ఓ రాష్ట్రంలో పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలోనే ఓటు హక్కును కలిగి ఉండాలి. చంద్రబాబు నాయుడితో పాటు పలువురు రాజకీయ నాయకులు చాలా కాలంగా హైదరాబాదులో ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రనేతలు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ మాత్రం తమ తమ నియోజకవర్గాల్లోనే ఓటర్లుగా నమోదై ఉన్నారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి వారి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు.
హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు కలిగి ఉన్న సీమాంధ్ర నాయకులు తమ సొంత రాష్ట్రంలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకుని పోటీ చేయడానికి వీలు కలుగుతుందా అనేది ప్రశ్న. ఆ నాయకులు తమ ఓట్లను బదిలీ చేసుకోవడానికి వీలుంటుందని, హైదరాబాదులో ఓటర్లుగా ఉన్నప్పటికీ తమ తమ సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
పైగా, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. దీంతో హైదరాబాదులో ఓటర్లుగా ఉన్న నాయకులు తమ తమ సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి వీలు ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ కెజె రావు చెప్పినట్లు దక్కన్ క్రానికల్ దినపత్రిక రాసింది.
పలువురు సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో ఆస్తులు సమకూర్చుకుని ఇక్కడే తమ స్థిరనివాసాలను ఏర్పరుచుకున్నారు. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు దాసరి నారాయణరావు, మురళీమోహన్, తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య తదితరులు హైదరాబాదులో స్థిరపడ్డారు. పదేళ్ల తర్వాత సీమాంధ్ర నాయకులు తమ ఓట్లను సీమాంధ్రకు మార్చుకోవచ్చునని, అయితే, హైదరాబాదులో హాయిగా ఉండవచ్చునని, కానీ తెలంగాణ పౌరులుగా ఉండబోరని తెలంగాణ నాయకులు అంటున్నట్లు ఆ పత్రిక రాసింది.