ఢిల్లీ వన్డేకు దావూద్ బంధువు మియాందాద్
పాకిస్తాన్ క్రికెట్కు సంబంధించి మియాందాద్ అంతటి అగ్రెసివ్ క్రికెటర్ ఇప్పటి వరకు మళ్లీ రాలేదు. పాకిస్తాన్ జట్టుకు ఆయన 1975, 1996 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్లో ప్రత్యర్థి బౌలర్లకు గుండె దడ పుట్టించేవాడు. మియాందాద్ 1957 జూన్ 12వ తేదీన పాకిస్తాన్లోని కరాచీలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు భారతదేశంలోని పంజాబ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది క్రికెటర్లు. మియాందాద్ చాలా రికార్డులనే నెలకొల్పాడు.
మియాందాద్ కుమారుడు జునైద్ మియాందాద్ దావూద్ ఇబ్రాహిం కూతురు ముహ్రుక్ ఇబ్రహీంను వివాహం చేసుకున్నాడు. ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న దావూద్ ఇబ్రాహిం కుటుంబంతో మియాందాద్ సంబంధం నెలకొల్పుకోవడం వివాదంగా మారింది. అయితే, దావూర్ కూతురు, తన కుమారుడు యుకెలో చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారని మియాందాద్ సమర్థించుకున్నారు. ఆ వివాహం కారణంగా అప్పట్లో ఓసారి భారత్ ఆ విషయంపై మియాందాద్కు భారత ప్రభుత్వం వీసాను నిరాకరించింది.
దావూద్ ఇబ్రహీం బంధువు అయిన జావెద్ మియాందాద్ ఈనెల 6వ తేదీన పాకిస్తాన్, భారత్ మధ్య జరిగే మూడో వన్డే మ్యాచును చూడడానికి ఢిల్లీ వస్తున్నాడు. అతనికి భారత ప్రభుత్వం వీసా ఇచ్చింది. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. బిజెపి, శివసేన వంటి పార్టీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మియాందాద్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) డైరెక్టర్ జనరల్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆయన నేరుగా పిసిబి చైర్మన్ జకా అష్రాఫ్కు మాత్రమే రిపోర్టు చేస్తారు.
అయితే, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో బంధుత్వం ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్కు వీసా మంజూరు చేయడాన్ని భారత ప్రభుత్వం సమర్థించుకుంది. మియాందాద్ భారత 'ప్రతికూల జాబితా'లో లేడని దేశీయ వ్యవహారాల మంత్రి ఆర్పీఎన్ సింగ్ చెప్పాడు. 'మియాందాద్ అందరికీ తెలిసిన క్రికెటర్. వీసా కోసం అతను చేసుకున్న దరఖాస్తు సవ్యంగానే ఉంది. సమర్పించిన అన్ని పత్రాలూ నిబంధనలకు లోబడే ఉన్నాయి. అతడు భారత ప్రతికూల జాబితా (నెగటివ్ లిస్ట్)లో కూడా లేడు. కాబట్టే అతనికి వీసా జారీ చేశాం' అనితెలిపాడు.