పివి కూతురికి చాన్స్: చిరంజీవి నెగ్గుతారా?
ఇప్పటికే కంతేటి సత్యనారాయణరాజు, పివి నరసింహారావు కూతురు వాణి, వ్యవసాయ నిపుణుడు అల్దాస్ జానయ్య పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన ఆ ఒక్క స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. పిసిసి కార్యదర్శి ఎస్పీ తివారి, భమిడిపాటి రామ్మూర్తి, పివి రంగారావు, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు కూతురు శ్రీనగి, ధీరావత్ భారతీనాయక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ సీనియర్ నేత బండి సుధాకర్గౌడ్ తదితరులు ప్రయత్ని స్తున్నారు.
కేంద్రమంత్రి పదవి ఎలాగూ ఇవ్వనందున, కనీసం తన కూతురుకు ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కావూరి ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల శ్రీనగి పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాహుల్ను కూడా కలసి, ఎమ్మెల్సీ సీటు అభ్యర్ధించినట్లు ప్రచారం జరిగింది. అయితే, కావూరి కుటుంబానికి రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి ఎంపీ సీటు దాదాపు ఖరారయిందని, అది ఆమె కూతురుకే దక్కుతుందన్న ప్రచారం తీవ్రస్థాయిలో జరిగిన విషయం తెలిసిందే.
కాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని తన వర్గానికి ఇప్పించుకునేందుకు కేంద్రమంత్రి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి డిటి నాయక్కు సీటు ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు గతంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించేందుకు చిరు ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకూ సీటు ఇప్పించేందుకు చిరు చేసిన ప్రయ త్నాలు విఫలమయ్యాయి.
డిటి నాయక్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. డిటి నాయక్కు ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకోవడంలో చిరంజీవి విజయం సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.