మేజిక్: జగన్ వర్గంపై వేటు వేస్తే కిరణ్ సేఫ్?

అయితే జగన్ పార్టీ నేతల పైన వేటు వేస్తే మాత్రం కిరణ్ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారిపై వేటు వేస్తే మేజిక్ ఫిగర్ మార్కు తగ్గుతుందని తద్వారా ప్రభుత్వం కొనసాగుతుందని వారు లెక్కలు వేసుకుంటున్నారట. అయితే, ఈ దశలోనూ ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
శాసన సభ్యత్వాలకు సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించడం.. వారిని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించడం ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోందట. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రస్తుత బలం 155. కాంగ్రెస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలనూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బహిష్కరిస్తే.. వారిపై అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉండదు.
వారు స్వతంత్రంగా ఒక బృందంగా ఉంటారు. అప్పుడు కాంగ్రెస్ బలం 146కు పడిపోతుంది. స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ను కలుపుకొంటే 147కు చేరుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాల బలం 146కు చేరుతుంది. అదే జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ప్రతిపక్షాలు నోటీసు ఇస్తే.. ప్రభుత్వం సంకటంలో పడుతుంది. కాంగ్రెస్ విప్ జారీ చేసినా.. ఆ 9 మంది దానిని ధిక్కరించే అవకాశం ఉంది.
అప్పుడు మేజిక్ మార్కు 148 కంటే కూడా ప్రభుత్వానికి ఒక సీటు తక్కువే ఉంటుంది. ఇదే సమయంలో అధికార పార్టీకి మరికొంతమంది సభ్యులు ఝలక్ ఇస్తే.. ప్రభుత్వం పడిపోతుంది. అలా కాకుండా, ఇప్పటికే రాజీనామాలు సమర్పించిన సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ఎం.రాజేశ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల రాజీనామాలను ఆమోదించడంతోపాటు ఇప్పటికే పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్లపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రయోగించి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తే కాంగ్రెస్ బలం 147కు చేరుతుంది.
కాంగ్రెస్లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నానని వ్యాఖ్యానించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పైనా వేటు వేస్తే, కాంగ్రెస్ బలం 146కు చేరుతుంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం గౌడ్ను కలుపుకొంటే ఈ బలం 147కు చేరుతుంది. ఇదే సమయంలో టిడిపికిచెందిన నలుగురు శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే.. సభలో ఇక 280 మంది సభ్యులు మిగులుతారు. దీని ప్రకారం మేజిక్ మార్కు 141 అవుతుంది. కాంగ్రెస్ బలం దీనికంటే ఎక్కువే ఉంటుంది కనక ప్రభుత్వం మైనారిటీలో కాకుండా పూర్తి ఆధిక్యంలోకి వచ్చినట్లు మారుతుందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications