జగన్ ఎఫెక్ట్: తెలంగాణకు కాంగ్రెసు మొగ్గు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా తన వైఖరిని చెప్పడానికి ఇష్టపడకపోయినా పరోక్షంగా ఆయనే రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడైతే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే, సీమాంధ్ర నేతలు కాంగ్రెసు అధిష్టానంపై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. వీరి వాదనలకు కాంగ్రెసు అధిష్టానం ఏ మేరకు తొలగ్గుతుందనేది చెప్పడం కష్టమే. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తన అనుకూల వైఖరికి స్వస్తి చెప్పేంత తీవ్రంగా వారి వాదనలు ఉంటే విభజన జరగకపోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడైతే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా కదలడానికి వైయస్ జగన్ ప్రభావమే కారణమని చెబుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన తమ పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలకైనా వెనకాడకుండా రాష్ట్ర విభజనకు పాదులు వేయాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్ర పార్టీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బ తిన్నట్లు అధిష్టానానికి సమాచారం అందింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తాము ఎన్ని సీట్లు గెలుస్తామనే విషయంలో సీమాంధ్ర నాయకులు స్పష్టంగా చెప్పలేకపోయినట్లు సమాచారం.

వైయస్ జగన్ ప్రాబల్యాన్ని సీమాంధ్రలో అడ్డుకోవడం సాధ్యం కాదనే సమాచారమే అధిష్టానం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. సీమాంధ్ర పార్టీ దెబ్బ తిన్నప్పుడు తెలంగాణలోనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే మెజారిటీ పార్లమెంటు సీట్లు తాము గెలిపిస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే తాము 15, 16 సీట్లు గెలుస్తాం, సమైక్యంగా ఉంచితే సీమాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుస్తామని సీమాంధ్ర నాయకులు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ఆ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు.

కేంద్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెసుకు ముఖ్యం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలోనైనా ఎక్కువ లోకసభ సీట్లు సాధించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని విలీనం చేసుకోవడం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్‌ను పూర్తిగా ఈ ప్రాంతంలో అడ్డుకోవచ్చుననే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో మజ్లీస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య పొత్తు కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసుకు సవాల్ విసురుతోంది. తెలంగాణ ఏర్పాటు చేస్తే మజ్లీస్‌ను పరిమితం చేయడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు వ్యూహాన్ని దెబ్బ తీయవచ్చునని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు వివరిస్తున్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడి పాదయాత్ర కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి వ్యతిరేకత తగ్గిందని, కాంగ్రెసు బాధ్యతారాహిత్యం వల్లనే తెలంగాణ సమస్య పేరుకుపోయిందని చెప్పడంలో చంద్రబాబు చాలా వరకు విజయం సాధించారని కాంగ్రెసు అధిష్టానం నమ్ముతున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతంలో సానుకూలత పెరిగితే తాము ఇంకా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి తెరాసను విలీనం చేసుకుంటే తెలంగాణలో తమకు తిరుగు ఉండదనే కచ్చితమైన అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం ముందుకు వచ్చారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+