ఆ 9కితోడు అమరావతిలో మరో 27 పట్టణాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో 9 నగరాలతో పాటు 27 పట్టణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కో పట్టణంలో సుమారు లక్ష మంది జనాభా ఉంటారని సీఆర్డీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి పట్టణానికి సమీపంలో నాలుగు ప్రాంతాలు ఉంటాయి. నివాస, వాణిజ్య, సామాజిక తదితర అన్ని మౌలిక వసతులు వాటిలోనే సమకూర్చుతారు.
వీటన్నిటి పరిధిలో 2050 నాటికి 14.50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సీఆర్డీఏ అంచనా వేస్తోంది. కాగా, నూతన రాజధాని ప్రాంతం ఏ విధంగా ఉండబోతోంది, అభివృద్ధి ఎలా ఉంటుందంటూ రైతులు మంత్రి పి నారాయణ, అధికారుల నుంచి సమాచారాన్ని ఆశించడంతోపాటు ప్రతిపాదిత నవ నగరాల్లో ఏది ఎక్కడ వస్తుందో చెప్పాలని కోరారు.
ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం సమర్పిస్తున్న ప్రణాళికల మేరకు వివరాలను సీఆర్డీఏ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. బోరుపాలెంలో క్రీడా నగరం, అనంతవరంలో సాంస్కృతిక, మీడియా నగరం ఏర్పాటు చేయనున్నారు.

వీటితోపాటు శాఖమూరు, నేలపాడుల్లో న్యాయ నగరం, ఐనవోలులో విద్య-విజ్ఞాన నగరం, ఉద్దండరాయునిపాలెంలో కేంద్ర ఆర్థిక నగరం, లింగాయపాలెంలో ప్రభుత్వ నగరం, కృష్ణాయపాలెం, నవులూరుల్లో ఆరోగ్య, ఉండవల్లిలో పర్యాటక, నిడమర్రు-కురగల్లులో ఎలక్ట్రానిక్ సిటీలు రావొచ్చని సీఆర్డీఏ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, నవ నగరాల పరిధి, ప్రాంతంపై స్పష్టతకు మరింత సమయం పడుతుందని.. బృహత్తర ప్రణాళికలు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు. రైతులు సమాచారం కోరుతున్నందున ప్రాథమిక అంచనాలను తాము వివరిస్తున్నామని సీఆర్డీఏ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, నవ నగరాలకు తోడుగా 27 పట్టణాలు కూడా అమరావతిలో ఆకర్షణీయంగా ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications