ఎపికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు 'సర్దుబాట'?
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం దాదాపుగా చేతులెత్తేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకా సర్దుబాటు ధోరణిలోనే నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పలదంటూ ఆయన మంత్రులతో అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రత్యేక హోదాపై కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనపై శుక్రవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను చంద్రబాబు సమావేశంలో చదివి వినిపించారు.
కేంద్రం చేసిన ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదని, మనకు ప్రత్యేక హోదా ఇస్తారో, ఇవ్వరో చెప్పలేదని, ఆ ప్రకటన మధ్యస్తంగా ఉందని ఆయన మంత్రివర్గ సహచరులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రణాళికా సంఘం మార్గదర్శక సూత్రాల గురించి ఆయన చెప్పారు.
అయితే, ఆ విషయాలు ఎలా ఉన్నప్పటకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది ఒక ప్రత్యేక పరిస్థితి అని, నిబంధనలతో సంబంధం లేకుండా మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో గతంలోనే నిర్ణయం తీసుకొన్నారని ఆయన ఆయన అన్నారు. మనం దాని గురించే అడుగుతున్నామని, అది కావాలని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరుకొంటున్నారని ఆయన చెప్పారు.
అలా సర్దిచెప్పే ధోరణిలో ఆయన మాట్లాడుతూనే, మనం కేంద్రంతో కలిసి ఉన్నా దీనిని వదిలిపెట్టేది లేదని, దీని సాధనకు మన ప్రయత్నం కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. మొత్తం మీద, చంద్రబాబు పరిస్థితి కక్కలేని మింగలేని విధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.