బాబుకు మింగుడుపడట్లేదు: మొక్కుబడిగా వద్దని వార్నింగ్, అనంతలో ఇదీ పరిస్థితి!
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నత్త నడకన సాగుతున్న జిల్లాల్లో అనంతపురం ముందు వరుసలో ఉన్నట్లు సీఎంకు రిపోర్టులు అందాయి.
అనంతపురం: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కార్యక్రమ తీరు తెన్నుల గురించి ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు.
ఏ జిల్లాల్లో పార్టీ నేతలు చురుగ్గా ఉన్నారు.. ఏయే జిల్లాల్లో కార్యక్రమం నత్త నడకన సాగుతోందన్న దానిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. కార్యక్రమం పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్న నేతల పట్ల నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమ ప్రాధాన్యత గురించి చెప్పిన తర్వాత కూడా కొంతమంది నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయన సహించలేకపోతున్నారు.

అనంత నేతలకు క్లాస్:
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నత్త నడకన సాగుతున్న జిల్లాల్లో అనంతపురం ముందు వరుసలో ఉన్నట్లు సీఎంకు రిపోర్టులు అందాయి. దీంతో ఆ జిల్లా నేతలకు క్లాస్ పీకినంత పనిచేశారు. కార్యక్రమంపై దృష్టి పెట్టకుండా ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతల మధ్య విభేదాలు పార్టీని భ్రష్టు పట్టిస్తే సహించేది లేదని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

నేతల వాదన మరోలా:
అనంతపురం జిల్లా నేతల వాదన మాత్రం మరోలా ఉంది. సమాచార లోపం వల్లే సీఎంకు తప్పుడు సమాచారం అందిందనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. సీఎంకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ముఖ్యంగా తాము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండటం లేదని, తద్వారా సకాలంలో తమకు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందడం లేదని వారు తెలిపారు. సీఎం మాత్రం ఎలాగైనా తనకు సమాచారం అందాల్సిందేనని తేల్చి చెప్పారు. నెట్ వర్క్ సిగ్నల్స్ ఉన్న ప్రదేశం నుంచి తనకు కమ్యూనికేట్ చేయాలని వివరించారు.

గ్రూపు రాజకీయాలు:
అందరిని కలుపుకునిపోవాలని సీఎం పదేపదే పార్టీ నేతలకు వివరిస్తున్నా.. నేతలు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. గ్రూపు రాజకీయాలతో తరుచూ తగాదాలు, గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో పాటు నేతల మధ్య విభేదాల గురించి ప్రస్తావన వచ్చింది.

మొక్కుబడిగా వద్దు:
సీఎం క్లాస్ తీసుకోవడంతో జిల్లా నేతలు కాస్త అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా అలసత్వాన్ని వీడుతారా? అన్నది అనుమానమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మాత్రం మొక్కుబడిగా పనిచేసేవాళ్లు తనకు అవసరం లేదన్నట్లుగానే మాట్లాడుతున్నారు. దీంతో సీఎంను శాంతపరచడానికి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముంది. గతంలో ఏర్పడ్డ విభేదాలను వీడితే తప్ప అది సాధ్యం కాదు. చూడాలి మరి అనంత టీడీపీ నేతలు సీఎంను ఎలా మెప్పిస్తారో!..












Click it and Unblock the Notifications