బాబు చలో సింగపూర్: రాజధాని, పెట్టుబడులు
హైదరాబాద్: కొత్త రాజధాని నిర్మాణం, భారీ పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బృందం మంగళవారం సింగపూర్ పర్యటనకు బయలుదేరుతోంది. మూడు రోజులపాటు జరిగే ఈ పర్యటనలో 13 మంది ప్రముఖులు ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నారు. ఈ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోటి రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
విజయవాడ, గుంటూరు మధ్యలో కొత్త రాజధానిని అత్యంత ఆధునీకరణతో నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి సింగపూర్ తరహాలో ఇక్కడి భవనాలు, రాజధాని ఉండాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సింగపూర్ను స్వయంగా సందర్శించాలని ఆయన నిర్ణయించారు. కేవలం రాజధాని నిర్మాణం ఒక్క అంశంపైనే కాకుండా పెట్టుబడులను ఆహ్వానించేందుకు కూడా ఈ పర్యటనను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.
చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, ప్రభుత్వ సలహాదారులు జె.సత్యనారాయణ, పరకాల ప్రభాకర్, ఐఏఎస్ అధికారి ఎస్పి టక్కర్, సాంబశివరావు, జెఎస్వి ప్రసాద్, గిరిధర్, ఎపిఎస్ఎస్డిసి డైరెక్టర్ లక్ష్మీనారాయణ, పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా సింగపూర్ మంగళవారం సాయంత్రం బయలుదేరుతున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన దేశంగా ఖ్యాతి నార్జించిన సింగపూర్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ను కూడా సన్ రెయిజ్డ్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు, రోడ్ల అనుసంధానం, 24 గంటల విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలు, ఐటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన వంటి అంశాలతో అక్కడి వారికి ప్రజంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

మొత్తం ముఖ్యమంత్రి బృందం మూడు విభాగాలుగా అధ్యయనం చేయనుంది. పారిశ్రామిక అభివృద్ధిపై పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించనుండగా, పెట్టుబడుల కోసం అక్కడి వారితో చర్చించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తారు. 11వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి బృందం సింగపూర్కు బయలుదేరుతుంది. 12వ తేదీన సెంటర్ ఫర్ లివబుల్ సిటీలను సందర్శిస్తారు.
అనంతరం గతం నుంచి సింగపూర్ ఎలా అభివృద్ధి చెందింది, దానికోసం తీసుకున్న చర్యలు ఏమిటనే విషయాలను వివరిస్తూ ఉన్న గ్యాలరీని అధ్యయనం చేస్తారు. అలాగే మెరీనా బే ప్రాంతాన్ని, దాని ప్రణాళికను, పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని పరిశీలిస్తారు. బుధవారం రాత్రి సింగపూర్లోని తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనే చంద్రబాబు గురువారం వివిధ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు.
సింగపూర్లోని ఉపరితల రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేస్తారు. అదే రోజు సింగపూర్ ఉప ప్రధానమంత్రి ఇచ్చే విందులో పాల్గొనే చంద్రబాబు 14వ తేదీన దక్షిణాసియా దేశాల అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొంటారు. ఆదే రోజు రాత్రి తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.












Click it and Unblock the Notifications