గ్యాంగ్ రేప్లు: సుడిగుండంలో అఖిలేష్ యాదవ్
మరోవైపు బదౌన్ కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. జాతీయ మహిళా కమిషన్ సైతం యూపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'లెక్కకు మిక్కిలి గ్యాంగ్రేప్లు జరుగుతుంటే ప్రభుత్వం రాష్ట్రాన్ని గూండాలకు అప్పగించిందా? దీనిపై రాష్ట్ర డీజీపీకి సమన్లు జారీ చేస్తాం' అని మహిళా కమిషన్ చీఫ్ మమతా శర్మ అన్నారు.
కాగా, కేసు విచారణలో అధికార ఎస్పీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. బిజెపి మహిళా మోర్చా సోమవారం సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐ నిర్ణయించింది. గ్యాంగ్రేప్ ఉదంతంపై సోమవారం బీజేపీ మహిళామోర్చా పెద్ద ఎత్తున నిరసనకు దిగింది.
మహిళామోర్చా కార్యకర్తలు రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు లక్ష్మీకాంత్ బాజ్పాయ్ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించారు. కాగా, బాధిత కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, ఆయన తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్లు పరామర్శించారు.
ములాయం ఎన్నికల ప్రచారంలో చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే రాష్ట్రంలో అత్యాచారాలు పెరగడానికి కారణమని దుయ్యబట్టారు. కాగా, బదౌన్ ఘటనను మరువకముందే యూపీలో మరో రెండు దారుణాలు చోటుచేసుకున్నాయని చిరాగ్ అన్నారు. బదౌన్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలపై దుండగులు అపహరించి, వారిపై సామూహిక అత్యాచారం చేసి, వారిని చంపి శవాలను చెట్టుకు వేలాడదీసిన సంఘటన తెలిసిందే.
అదలావుంటే, బరేలిలో 22 ఏళ్ల యువతిని గ్యాంగ్రేప్ చేసి, ఆమెను గుర్తుపట్టకుండా ఉండేదుకు మొహంపై యాసిడ్ పోసి దారుణంగా హత్య చేశారు. మరో ఘటన ముజఫర్నగర్లో చోటుచేసుకుంది. శివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా అర్చకురాలిపై బాలు అనే యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపర్చాడు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం గవర్నర్ బీఎల్ జోషిని కలిశారు. బదౌన్ ఘటనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు అఖిలేష్ వివరించారు. విపక్షాల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అఖిలేష్ తాజా గా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై వేటు వేశారు. ఆయనను వెయిటింగ్ లిస్టులో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అఖిలేష్ ప్రకటించారు.