మతపెద్దల సహకారం: ఐసిస్ ఉగ్రవాదులను ఎలా అరెస్ట్ చేశారంటే
హైదరాబాద్: హైదరాబాద్తో పాటు దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు పక్కా పథకం వేసుకుని కూర్చున్న ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐసిస్ సానుభూతిపరులంటూ పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో 11 మందిని అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ అధికారులు స్థానిక ముస్లిం మత పెద్దల సహకారం తీసుకున్నారు.
ఎన్ఐఏ అధికారులు, హైదరాబాద్ పోలీసులు కలిసి ఉగ్రవాదులను పట్టుకునేందుకు సాహసం చేసినా.. ఇందుకు పూర్తిగా సహకరించింది మాత్రం పాతబస్తీలోని స్థానిక ముస్లిం మత పెద్దలేనని అంటున్నారు. వారి సహకారమే లేకపోతే ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకోవడం, శని, ఆదివారాల్లో జరపాలనుకున్న ఉగ్ర దాడులను భగ్నం చేయడం సాధ్యమయ్యేది కాదని అంటున్నారు.
అయితే ఈ ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగుచూశాయి. తాము పవిత్రంగా భావించే మసీదు నుంచే పోలీసులకు దారి చూపించిన మత పెద్దలు ఉగ్రవాదుల అరెస్ట్లో కీలక భూమికే పోషించారు. వివరాల్లోకి వెళితే...
ఇటీవల అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉగ్రవాదులు పాతబస్తీలో పోలీసు దుర్భేద్యమైన మసీదు అవతల మకాం వేశారు. వారు ఉంటున్న ఇంటికి వెళ్లాలంటే మసీదు నుంచి వెళ్లాల్సిందే. వాళ్ల ఇంటికి వెళ్లడానికి అది తప్ప మరో మార్గం లేదు. అందులోనూ, రంజాన్ నెలలో, తెల్లవారు జామున మొట్టమొదటిసారిగా జరిగే ఫజర్ నమాజ్ (తెల్లవారుజామున 5 గంటలు) సమయంలో మసీదు నుంచి పోలీసులు వెళ్లడం అంటే మాటలు విషయం కాదు.
కానీ, వెళ్లకపోతే ఆ ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ పరిస్థితులు అదుపు తప్పితే అల్లర్లు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదు. అయితే వీటన్నిటికీ భయపడి వెనకడుగు వేస్తే... మరో రెండు, మూడు రోజుల్లో నగరంలో పెను బీభత్సం తప్పదు. ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్న ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదుల ఇంటికి అడ్డుగోడగా ఉన్న మసీదుకు చెందిన మతపెద్దలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
వెంటనే చార్మినార్ సమీపంలో నిందితుల ఇళ్లకు వెళ్లడానికి మధ్యలో ఉన్న మసీదు మత పెద్దలను కలిశారు. జరగబోయే మారణ హోమాన్ని వారికి వివరించారు. ఇందుకు వారిని సహకరించాలని కోరారు. మత పెద్దలు మాత్రమే కాదు.. కొంతమంది స్థానికులు కూడా ఎన్ఐఏకు సహకరించడానికి ముందుకొచ్చారు.
బుధవారం తెల్లవారుజామున తొలి నమాజ్ (5 గంటలకు జరిగే ఫజర్ నమాజ్) ముగియగానే ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. సదరు మసీదులో జరిగిన ఈ నమాజ్ కు ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా హాజరయ్యారు. నమాజ్ ముగించుకుని ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఇంటికి చేరుకున్న వెంటనే, ఇద్దరు నిందితుల ఇళ్లపైనా దాడులు చేశారు.
వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలో వారు దాచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే తమకు సహకరించిన ముస్లిం మత పెద్దలను అక్కడికి పిలిపించి ఉగ్రవాదులు దాచిన పేలుడు పదార్థాలను చూపించారు. ఆ పేలుడు పదార్థాలను చూసి ముస్లిం మత పెద్దలు కూడా నివ్వెరపోయారు.
ఎన్ఐఏ అధికారులకు తాము సహకరించకపోయి ఉంటే, పెను విధ్వంసమే జరిగి ఉండేదని ఆందోళనకు గురయ్యారు. మసీదు ద్వారా పోలీసులకు దారిచ్చి మంచి పని చేశామని వారు భావించారు. ఈ మేరకు ఈ మొత్తం ఎపిసోడ్ను ఎన్ఐఏ అధికారులు గంట వ్యవధిలోనే పూర్తి చేశామని, ఉగ్రవాదుల రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేయడం విశేషం.
ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురు హైదరాబాదీలు కాదు. వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారం పేరిట వచ్చిన వ్యక్తులే ఇక్కడ ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.
తాజాగా ఐదుగురు నిందితులు పట్టుబడిన విషయమై పాతబస్తీలో రాజకీయంగా పట్టున్న మజ్లిస్ పార్టీలో కూడా మేథో మథనం జరుగుతున్నట్లు సమచారం. ''ముస్లిం పేరిట ప్రతి ఒక్కరినీ కౌగిలించుకోవద్దు. ముందుగా వారి వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాతే ఆశ్రయం ఇవ్వండి. ముస్లిం పేరిట అందరినీ నమ్మవద్దు. ఎవరికి పడితే వాళ్లకు ఇళ్లు కిరాయికి ఇవ్వవద్దు'' అంటూ మజ్లిస్ పార్టీ ప్రచారం కూడా చేస్తోంది.