రివర్స్: నారా లోకేష్కు ఒబామాను కలిసిన చిక్కు!
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్కు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాను కలిసిన చిక్కులు వచ్చిపడ్డాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. ఒబామాతో ఫోటో కోసం డెమెక్రటికి పార్టీ ఎన్నికల నిధికి చట్టవిరుధ్ధంగా లోకేష్ విరాళం ఇచ్చారని రాసింది.
ఒబామాను కలిసేందుకు లోకేశ్ పెట్టిన ఖర్చే ఇప్పుడాయనకు ఉచ్చులా బిగుస్తోందని రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకంటూ మే నెలలో లోకేశ్ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో మే 7న ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్లాండ్లోగల సెంటినరీ హోటల్లో ఆయన ఒబామాతో ఫొటో దిగారు.
2016 అధ్యక్ష ఎన్నికల కోసం నిధుల సేకరణలో భాగంగా అమెరికా దేశస్తులు నిర్ణీత ధర చెల్లిస్తే ఒబామాను కలిసే అవకాశం కల్పించారు. ఇందుకు 500 నుంచి 10,000 డాలర్ల వరకు వివిధ టికెట్లను విక్రయించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న లోకేశ్, పదివేల డాలర్ల టికెట్ కొని ఒబామాతో కరచాలనం చేసే అవకాశం సంపాదించారని వార్తలొచ్చాయి. ఒబామాను కలిసి ఫొటోను కూడా ఆయన విడుదల చేశారు.
అయితే, అమెరికా చట్టాల ప్రకారం ఏ పార్టీ ఎన్నికల నిధికైనా కేవలం అమెరికన్ పౌరులు మాత్రమే విరాళాలు ఇవ్వాలి. విదేశీయులు, అందునా విదేశీ రాజకీయ నాయకులు, పార్టీలు ఎట్టిపరిస్థితుల్లోనూ విరాళాలు ఇవ్వకూడదు.
ఒకవేళ తెలియక ఇచ్చినా ఆ విషయాన్ని తమ సొంత ప్రచారం కోసం వాడుకోకూడదు. అమెరికా సమాఖ్య ఎన్నికల ప్రచార చట్టం (ఎఫ్ఈసీఏ)- 1971లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.
దాంతో ఒబామాను కలిసేందుకు విదేశీయుడైన లోకేశ్ చట్టవ్యతిరేకంగా విరాళం ఇచ్చాడని ప్రవాస భారతీయుడు, డెమోక్రటిక్ పార్టీ రిజిస్టర్ సభ్యుడు నాగేందర్ రావు మాధవరం గత నెల 24న అమెరికా సమాఖ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని నమస్తే తెలంగాణ రాసింది.
తాను డెమోక్రటిక్ సభ్యుడినే అయినప్పటికీ చట్ట ఉల్లంఘన జరుగరాదన్న కారణంతోనే ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారని పేర్కొంది. లోకేశ్ ఒక ప్రాంతీయ పార్టీ యువ విభాగానికి నాయకుడని, ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా అమెరికా వచ్చారని తెలిపారు.
అంతేకాకుండా అధ్యక్షుడిని కలిసిన సందర్భాన్ని తన వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకొన్నారంటూ కొన్ని పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చిన వార్తల కూడా ఆధారంగా పంచారు. ఫిర్యాదును స్వీకరించినట్లు నాగేందర్ రావుకు ఈ నెల ఒకటోతేదీన సమాఖ్య ఎన్నికల సంఘం అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్ జెఫ్ ఎస్ జోర్డాన్ వర్తమానం పంపారు.
ఈ ఫిర్యాదును ఎంయూఆర్ 6946 నంబర్తో రిజిస్టర్ చేశామని, ఇంకా ఏమైనా ఆధారాలున్నా వెంటనే పంపాలని కోరారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం త్వరలోనే తుది నిర్ణయం తీసుకొంటుందన్నారు. ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొంటే లోకేశ్కు నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోందని రాసింది.