తెలంగాణ బిల్లుపై కోర్ కమిటీదే ఫైనల్?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై తుది నిర్ణయం కాంగ్రెసు కోర్ కమిటీయే తీసుకోనుంది. ఈ నెల 22వ తేదీన జీవోఎం నివేదికను సమీక్షించిన తర్వాత తెలంగాణ బిల్లుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ సమక్షంలో కోర్ కమిటీ సమీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు వ్యవహారంతోపాటు జీవోఎం సిఫారసులు, టి.బిల్లు, సీమాంధ్ర ప్యాకేజీ తదితర అంశాలన్నీ కోఃర్ కమిటీయే ఖరారు చేయాల్సి ఉంది. కోర్ కమిటీ భేటీలోనే అన్ని అంశాలపై లోతుగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటారని, తరువాతే టి.బిల్లు కేబినెట్ పరిశీలనకు వెళ్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
దాన్ని బట్టి చూస్తే 21న జరగబోయే కేంద్ర కేబినెట్కు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదు. 22న కోర్ కమిటీలో జీవోఎం నివేదికను సమీక్షించాక, 28న జరగనున్న కేబినెట్ భేటీలో బిల్లును చర్చిస్తారని తెలుస్తోంది. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రతిపాదిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే ప్రకటించారు. అయితే, ఏ తేదీల్లో ప్రతిపాదిస్తారన్న ప్రశ్నకు షిండే సమాధానం ఇవ్వలేదు. డిసెంబర్ 19వ తేదీన పార్లమెంటుకు బిల్లు వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
బాలల చలన చిత్రోత్సవం కారణంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం నాటి జీవోఎం సమావేశానికి రావటం లేదని షిండే వెల్లడించారు. 18న జీవోఎం భేటీకి హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రూపకల్పనను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పరిధి, ఏ చట్టం కింద శాంతి భద్రతలు, భూమి, రెవెన్యూ శాఖలను గవర్నర్ పరిధిలోకి తేవాలనేది కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఖరారు కానుందని స్పష్టం చేశారు.
కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో 22న జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో హోంమంత్రి సుశీల్కుమార్ షిండే తెలంగాణ ఏర్పాటు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెబుతున్నారు. షిండే నాయకత్వంలోని జీవోఎం 18న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ మంత్రులతో తుది చర్చలు జరిపిన అనంతరం నివేదికను 20న ఖరారు చేస్తారని అంటున్నారు. షిండే ఈ నివేదికతోపాటు న్యాయ శాఖ తయారు చేసిన టి.బిల్లు, కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసిన సీమాంధ్ర ప్యాకేజీని కోర్ కమిటీ ముందుంచుతారని అంటున్నారు. వైద్య ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కోర్ కమిటీ భేటీకి పిలిచే అవకాశాలు ఉన్నాయని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.
కోర్ కమిటీ భేటీలోనే అన్ని అంశాలపై లోతుగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటారని, తరువాతే తెలంగాణ బిల్లు కేబినెట్ పరిశీలనకు వెళ్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జీవోఎం సిఫారసులతోపాటు తెలంగాణ బిల్లును పరిశీలించి రాష్టప్రతికి పంపించేందుకు కేంద్ర కేబినెట్ గడువుకంటే ముందే సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మామూలుగా అయితే కేంద్ర కేబినెట్ ప్రతి గురువారం సమావేశమవుతుంది. ఈ లెక్కన 21న, ఆ తరువాత వచ్చేవారం 28తేదీ సమావేశం జరుపుతుంది.
ఈనెల 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో జీవోఎం సిఫారసులు, తెలంగాణ బిల్లు చర్చకు వచ్చే అవకాశాలు అంతగా లేనందున, వచ్చేవారం అంటే 28న జరిగే కేబినెట్ భేటీలో తప్పకుండా చర్చకు వస్తాయని హోం శాఖ అధికార్లు చెబుతున్నారు. అయితే 28కంటే ముందే తెలంగాణ బిల్లును ఆమోదించి రాష్టప్రతికి పంపించాలనుకుంటే వచ్చేవారం 25 లేదా 26 తేదీల్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరిపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.